మాస్కో: రష్యాలో ఇవాళ విక్టరీ డే సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాస్కోలోని రెడ్స్క్వేర్లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగించారు. రష్యా రక్షణ కోసం దేశ సైనికులు పోరాడుతున్నట్లు పుతిన్ తెలిపారు. విక్టరీ డే సందర్భాన్ని గుర్తు చేస్తూ మాజీ సైనికులను ఆయన ప్రశంసించారు. ఉక్రెయిన్పై చేపట్టిన ప్రత్యేక సైనిక చర్యను పుతిన్ సమర్థించుకున్నారు. ఉక్రెయిన్పై ఆక్రమణ అవసరమైందని, అది సరైన సమయంలో జరిగినట్లు పుతిన్ చెప్పారు. వ్యక్తిగతమైన, బలమైన, సార్వభౌమ దేశానికి అదే సరైన నిర్ణయమని పుతిన్ అన్నారు. గత కొన్నేళ్ల నుంచి యురోపియన్ దేశాలు, నాటోతో రష్యా ప్రమాదం ఏర్పడిందన్నారు. సామరస్య పూర్వక పరిష్కారం కోసం యురోప్ దేశాలను రష్యా వేడుకున్నదని, కానీ ఆ దేశాలు తమను పట్టించుకోలేదని పుతిన్ అన్నారు. రష్యా అభ్యర్థనను పశ్చిమ దేశాలు వినిపించుకోలేదని, ఆ దేశాలు ఇతర ప్రణాళికలతో ఉన్నాయని, తమ భూభాగాన్ని ఆక్రమించేందుకు పశ్చిమ దేశాలు సిద్దమైనట్లు పుతిన్ ఆరోపించారు.
ఉక్రెయిన్లోని డాన్బాస్లో ఆ దేశాలు చర్యకు పాల్పడ్డాయని, ఇప్పుడు రష్యా ఆ ప్రాంతంలోనే తమ ఆపరేషన్స్ను ఫోకస్ చేసినట్లు పుతిన్ వెల్లడించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికులకు పుతిన్ నివాళి అర్పించారు. అంతకముందు రెడ్స్క్వేర్లో సైనిక ప్రదర్శన చేపట్టారు. అయితే వాతావరణం సరిగా లేని కారణంగా.. ఫ్లైపాస్ట్ను నిర్వహించలేదు.
పుతిన్ తన ప్రసంగంలో ఎటువంటి భారీ ప్రకటన చేయలేదు. విక్టరీ డే రోజున ఉక్రెయిన్పై పూర్తి స్థాయి యుద్ధాన్ని పుతిన్ ప్రకటించనున్నట్లు పశ్చిమ దేశాలు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై పుతిన్ ఎటువంటి ప్రకటన చేయలేదు. రష్యా సరిహద్దుల్లో ఉక్రెయిన్, నాటో ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నట్లు పుతిన్ మరోసారి ఆరోపించారు. అణ్వాయుధాల సమీకరణపై కీవ్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం ఉందని, ఇక నాటో ఆ ప్రయోగాల కోసం తమ దేశ సరిహద్దుల వద్ద భూమిని పరిశీలిస్తున్నట్లు పుతిన్ పేర్కొన్నారు. ఇది తమకు ప్రమాదకరంగా మారిన నేపథ్యంలోనే తాము సైనిక చర్యకు దిగినట్లు పుతిన్ వెల్లడించారు.