కొలంబో, మే 12: శ్రీలంక కొత్త ప్రధానిగా ప్రతిపక్ష యూఎన్పీ పార్టీ నేత రణిల్ విక్రమ సింఘే(73) గురువారం ప్రమాణం చేశారు. అంతకుముందు అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధికార ఎస్ఎల్పీపీ, ఇతర పార్టీల నేతలతో తన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రిగా విక్రమ సింఘేకు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో, గొటబయ అధ్యక్ష కార్యాలయంలోనే విక్రమ సింఘే చేత ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ప్రధాని మహింద కూడా విక్రమ సింఘేకు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు. శ్రీలంకలో కొత్త ప్రభుత్వాన్ని భారత్ స్వాగతించింది. శ్రీలంకకు ఇండియా సాయం ఎప్పుడూ ఉంటుందని భారత హైకమిషన్ పేర్కొన్నది.
ఆరోసారి ప్రమాణం
విక్రమ సింఘే వృత్తి రీత్యా లాయర్. 1977లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 45 ఏండ్లుగా ఎంపీగా ఉన్నారు. పలు దఫాల్లో నాలుగు సార్లు ప్రధానిగా పనిచేశారు. తాజాగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2020లో పార్లమెంటు ఎన్నికల్లో విక్రమ సింఘే నేతృత్వం వహిస్తున్న యూఎన్పీ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అయితే, పార్టీకి జాతీయ స్థాయిలో వచ్చిన ఓట్లను బట్టి ఆ పార్టీకి సీట్లు కేటాయించే పద్ధతి శ్రీలంకలో ఉంది. ఈ పద్ధతి ద్వారానే విక్రమ సింఘే మళ్లీ ఎంపీ అయ్యారు. తద్వారా ప్రధాని అయ్యారు.
మహింద పారిపోకుండా నిషేధం
మాజీ ప్రధాని మహింద, ఆయన కుమారుడు నమల్ రాజపక్స, మరో 15 మంది దేశం విడిచి పారిపోకుండా శ్రీలంకలోని ఫోర్ట్ కోర్టు వారి ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. సోమవారం మహింద మద్దతు దారులు నిరసనకారులపై దాడులకు తెగబడిన కేసులు దర్యాప్తు నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీచేసింది. వారి పాస్ పోస్టులను సరెండర్ చేయాలని కోరింది.