వాషింగ్టన్: అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం చారిత్రక తీర్పు ఇచ్చింది. సుమారు 50 ఏళ్లుగా అమలులో ఉన్న అబార్షన్ హక్కును రద్దు చేసింది. మహిళలకు అబార్షన్ హక్కు కల్పించిన 1973 నాటి ‘రోయి వి. వేడ్’ నిర్ణయం ఇక ముగిసిదంటూ సంప్రదాయవాద ఆధిపత్యమున్న న్యాయస్థానం తెలిపింది. ‘రాజ్యాంగం అబార్షన్ హక్కును అందించలేదు. రోయి, కేసీ తీర్పులు రద్దయ్యాయి. అబార్షన్ను నియంత్రించే అధికారం ప్రజలకు, ఎన్నికైన వారి ప్రతినిధులకు తిరిగి దక్కుతుంది’ అని కోర్టు పేర్కొంది. అబార్షన్ను నియంత్రించేలా లేదా పరిమితం చేసేలా రాష్ట్రాలు ఇకపై చట్టాలు, అధికారాలు చేయవచ్చని వెల్లడించింది.
కాగా, మహిళలకు వారి శరీరంపై గోప్యత కోసం రాజ్యాంగం కల్పించిన హక్కు ఆధారంగా వారికి అబార్షన్ హక్కు ఉంటుందని రోయి వి. వేడ్ నేతృత్వంలోని అమెరికా సుప్రీంకోర్టు ధర్మాసనం 1973లో చారిత్రక తీర్పు ఇచ్చింది. దీంతో నాటి నుంచి ఆ దేశంలో అబార్షన్లు చట్టబద్ధమయ్యాయి. అయితే నియంత్రణ లేని అబార్షన్లు, మహిళల ఆరోగ్యంపై ప్రభావంపై అమెరికాలోని కొన్ని వర్గాలు గత కొన్నేళ్లుగా పోరాడుతున్నాయి. అబార్షన్ హక్కును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. మెజారిటీ ప్రజల అభిప్రాయం ప్రకారం గర్భస్రావం అనేది ఒక లోతైన నైతిక సమస్య అని, దీనిపై అమెరికన్లకు విరుద్ధమైన అభిప్రాయాలున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శామ్యూల్ అలిటో అన్నారు. ‘అబార్షన్ను నియంత్రించడం లేదా నిషేధించడంపై ప్రతి రాష్ట్రంలోని పౌరులను రాజ్యాంగం నిషేధించలేదు’ అని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు అబార్షన్లపై ఆంక్షలను పలు దేశాలు సడలిస్తున్న తరుణంలో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై ఆ దేశ సంప్రదాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఉదారవాదులు కోర్టు తీర్పును విభేదించారు. పేద మహిళలు, ముఖ్యంగా నల్లజాతి మహిళలపై ఇది బాగా ప్రభావం చూపుతుందని అన్నారు. కాగా, ఈ తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు వాషింగ్టన్లోని కోర్టు పరిసరాల్లో బారీగా బారీకేడ్లను ఏర్పాటు చేశారు.