వాషింగ్టన్: అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఓ కొత్త విషయాన్ని చెప్పాయి. కోవిడ్ ఆనవాళ్లను ఎన్నటికీ గుర్తించలేమని పలు ఏజెన్సీలు అభిప్రాయపడ్డాయి. కరోనా వైరస్ ఎలా సంక్రమించింది, జంతువుల నుంచి మనుషులకు ముందు సోకిందా లేక ఆ మహమ్మారి వైరస్ ల్యాబ్ నుంచి లీకైందా అన్న విషయాన్ని తేల్చడం ఎన్నటికీ వీలుకాదు అని అమెరికాకు చెందిన నేషనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసు పేర్కొన్నది. ఆఫీస్ ఆఫ్ ద యూఎస్ డైరక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (ఓడీఎన్ఐ) ఈ అంశంపై ఓ నివేదికను రిలీజ్ చేసింది. మనుషుల్లో సార్స్ సీవోవీ2 వైరస్ సోకడానికి .. వైరస్ సహజంగా పుట్టిందైనా కావచ్చు అని, లేక అది ల్యాబ్ నుంచి లీకైనా అయి ఉంటుందని ఓడీఎన్ఐ తెలిపింది.
వైరస్ జంతువుల నుంచి పుట్టిందా లేక ల్యాబ్ నుంచి వ్యాపించిందా అన్న విషయంలో నిర్ధారణ వీలుకాదని పలు ఏజెన్సీల నిపుణులు తెలిపారు. జీవాయుధం రూపంలో కరోనా వైరస్ను ప్రయోగించినట్లు వస్తున్న వార్తలను ఆ నివేదిక ఖండించింది. జీవాయుధ కోణానికి.. వుహాన్ వైరాలజీ ల్యాబ్కు ఎటువంటి సంబంధం లేదని రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ అంశంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినట్లు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం 90 రోజుల క్రితం రిలీజ్ చేసిన నివేదిక ఆధారంగా విశ్లేషణాత్మక రిపోర్ట్ను తయారు చేశారు. కొందరు శాస్త్రవేత్తలు వైరస్ ల్యాబ్ నుంచి లీకైనట్లు భావిస్తుండగా, మరికొందరు మాత్రం ఆ వైరస్ సహజంగానే వ్యాపించినట్లు చెబుతున్నారు.
జంతువుల నుంచి కోవిడ్19 వ్యాపించినట్లు తమకు పెద్దగా నమ్మకం లేదని అమెరికాకు చెందిన నాలుగు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తెలిపాయి. కానీ కరోనా వైరస్ ల్యాబ్ నుంచే లీకైనట్లు కొంత నమ్మకం ఉన్నట్లు ఓ ఏజెన్సీ పేర్కొన్నది. వుహాన్ ల్యాబ్లో జరిగిన ప్రమాదం వల్ల ఆ వైరస్ మహమ్మారిగా మారిందని తమ నివేదికలో ఆ ఏజెన్సీ వెల్లడించింది. ఏదేమైనా కోవిడ్ ఆనవాళ్లు, వైరస్ పుట్టుక గురించి కచ్చితమైన ఆధారాలను, వివరణను ఇవ్వలేమని అమెరికా ఏజెన్సీలు పేర్కొన్నాయి.