తైపే, ఆగస్టు 2: తైవాన్ అంశంలో అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. తైవాన్ భూభాగంలో అడుగుపెడితే మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్న డ్రాగన్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ మంగళవారం రాత్రి తైవాన్ గడ్డపై అడుగుపెట్టారు. ఈ పరిణామాన్ని చైనా తీవ్రంగా పరిగణించింది. ‘తైవాన్ అంశంలో కొందరు అమెరికన్ రాజకీయ నాయకులు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు’ అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మండిపడ్డారు. తన పర్యటన తైవాన్ ప్రజాస్వామ్యానికి మద్దతు విషయంలో అమెరికా నిబద్ధతను చాటుతున్నదని పెలోసీ పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. తైవాన్లో పెలోసీ అడుగుపెట్టిన నేపథ్యంలో చైనాకు చెందిన ఎస్యూ-35 యుద్ధ విమానాలు తైవాన్ జలసంధిని దాటి వెళ్లినట్టు చైనా ప్రభుత్వ మీడియా చైనా డెయిలీ ఓ కథనంలో వెల్లడించింది. పీఎల్ఏ బలగాలు, యుద్ధ ట్యాంకులు తైవాన్ వైపునకు కదులుతున్నట్టు వియెబో మీడియా వెల్లడించింది. తమ గగనతలంలోకి 21 చైనా యుద్ధ విమానాలు ప్రవేశించాయని తైవాన్ వెల్లడించింది. మరోవైపు, చైనా హెచ్చరికల నేపథ్యంలో తైపీ సముద్ర జలాల్లో అమెరికా నాలుగు యుద్ధ నౌకలను మోహరించినట్టు సమాచారం. కాగా తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని చైనా వాదిస్తుండగా, తమది స్వతంత్య్ర, సర్వసత్తాక దేశమని తైవాన్ పేర్కొంటున్నది.