బీజింగ్: అమెరికా గగనతలంలోకి వెళ్లిన చైనా నిఘా బెలూన్ను ఆ దేశపు సైన్యం పేల్చివేయడంపై చైనా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరసేవల కోసం తాము నింగిలోకి పంపిన బెలూన్ను నిఘా బెలూన్ పేరుతో ఆమెరికా కూల్చివేయడం దారుణమని మండిపడింది. అలా పేల్చివేయాలంటే తాము పేల్చేవాళ్లమని, అమెరికాకు చెందిన బెలూన్లు పదిసార్లకు పైగా తమ గగతతలంలోకి ప్రవేశించాయని ఆరోపించింది.
చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మీడియాతో మాట్లాడుతూ.. 2022 జనవరి నుంచి ఇప్పటి వరకు అమెరికాకు చెందిన 10కి పైగా బెలూన్లు తమ గగనతలంలోకి ప్రవేశించాయన్నారు. అక్రమంగా ఇతర దేశాల గగనతలాల్లోకి ప్రవేశించడం అమెరికాకు సర్వసాధారణమేనని ఆయన విమర్శించారు. గత ఏడాది జనవరి నుంచి ఆమెరికాకు చెందిన 10కి పైగా బెలూన్లు చైనా అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా తమ గగనతంలో ఎగిరాయని వాంగ్ ఆరోపించారు.
కాగా, ఈ నెల తొలి వారంలో తమ గగనతలంలోకి ప్రవేశించిన చైనా బెలూన్ను అమెరికా సైన్యం పేల్చేసింది. దాంతో గత రెండు వారాలుగా అమెరికా, చైనా దేశాల మధ్య సంబంధాలు మసకబారాయి. ఈ క్రమంలో అమెరికాపై చైనా తాజా ఆరోపణలు చేసింది. అమెరికా, కెనడా గగనతలాలపై ఇటీవల చాలా స్పై ఆబ్జెక్ట్స్ను కూల్చివేశారని, అందులో తొలుత కూల్చింది మాత్రమే తమదని వాంగ్ స్పష్టంచేశారు.