వాషింగ్టన్, జూన్ 19: రోజురోజుకు పెరిగిపోతున్న ఎలుకల బెడదపై అమెరికాలోని వాషింగ్టన్ వాసులు దండయాత్ర ప్రారంభించారు. ఇటీవల పలు కారణాలతో నగరంలో మూషిక సంతతి ఎక్కువైంది. వీటి నిర్మూలనకు పౌరులు నూతన విధానాలను కాదని, ప్రాచీన పద్ధతులు అవలంబించడం విశేషం. నగరవాసులు గ్రూపులుగా ఏర్పడి తమతో పాటు కుక్కలు, పిల్లులను వెంటేసుకుని ఎలుకల సంహారానికి బయలుదేరుతున్నారు.
మరికొందరు వారాంతాలను ఈ మూషిక సంహారానికి కేటాయిస్తున్నారు. పొరుగు రాష్ర్టాల నుంచి సైతం వచ్చిన చాలామంది ఈ గ్రూపుల్లో చేరి ఎలుకల వధకు సహకరిస్తున్నారు. కొన్ని శునక జాతులను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వినియోగిస్తున్నారు. తమకంటే పెంపుడు కుక్కలే ఎలుకలను వేగంగా పట్టుకుంటున్నాయని కొందరు నగరవాసులు సంబరపడుతున్నారు.