Donald Trump : పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితుతులు ఏర్పడ్డాయి. ఇరాన్పై అమెరికా దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. అమెరికా వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్ను ఇరాన్ డ్రోన్ దాడితో కూల్చేసింది. హార్ముజ్ జలసంధి వద్ద, ఒమన్ తీరంలో హెలికాప్టర్ను పేల్చివేసింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్పై తీవ్రంగా దాడులు చేస్తామని హెచ్చరించారు.
దీంతో ఇరాన్పై అమెరికా మళ్లీ దాడులకు దిగింది. హార్ముజ్ జలసంధి పరిధిలోని క్వెష్మ్ ఐలాండ్తోపాటు పోర్ట్ సిటీ అయిన సిరిక్పై కూడా అమెరికా దాడి చేసిందని ఇరాన్ తెలిపింది. జాస్క్ కౌంటీ సమీపంలోని బండార్ అబ్బాస్ వద్ద కూడా పేలుడు జరిగిందని ఇరాన్ వెల్లడించింది. ఇరాన్ దక్షిణ భాగంలోని అనేక ప్రాంతాలపై అమెరికా దాడి చేస్తోందని ఆ దేశం తెలిపింది. తమ హెలికాప్టర్పై జరిగిన దాడికి బదులుగా, ఆత్మరక్షణ విధానంలో భాగంగానే దాడులు చేస్తున్నామని అమెరికా ప్రకటించింది. ఈ దాడులపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. ఇరాన్ ఏ దాడినీ వదిలిపెట్టబోదన్నారు.
హెలికాప్టర్పై దాడి చేసిన ఘటనను ఉదహరిస్తూ.. విదేశీ దళాలు అక్కడ్నుంచి వెళ్లిపోవాలని సూచించారు. లేదంటే తమ సైనిక చర్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. హార్ముజ్ నుంచి వెళ్లిపోవడం ఒక్కటే మార్గం అని అబ్బాస్ సూచించారు. ఇదే సమయంలో గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులకు దిగింది. బహ్రెయిన్లోని ఐదవ యూఎస్ ఫ్లీట్పై ఇరాన్ దాడి చేసింది. జోర్డాన్, కువైట్పై కూడా ఇరాన్ దాడులు చేస్తోంది. ఇరాన్ జరిపిన మిస్సైల్ను తమ రక్షణ వ్యవస్థ అడ్డుకుందని జోర్డాన్ ప్రకటించింది. తాజా పరిణామాలతో అమెరికా, ఇరాన్ మద్య చర్చలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.