లండన్: బ్రిటన్లో ఒమిక్రాన్ మరణాలు 12కు చేరాయి. ఆ దేశ డిప్యూటీ ప్రధాని డొమినిక్ రాబ్ సోమవారం ఈ విషయాన్ని తెలిపారు. కొత్త కరోనా వేరియంట్ బారిన పడిన 104 మంది ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో క్రిస్మస్కు ముందు సామాజిక ఆంక్షలను కఠినతరం చేయడాన్ని తోసిపుచ్చేందుకు ఆయన నిరాకరించారు. కాగా, బ్రిటన్లో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ పాజిటివ్ రోగులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దీంతో వైద్య వ్యవస్థలపై భారం పడే ప్రమాదమున్నదని ఆ దేశ నిఫుణులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు ప్రజలపై ఆంక్షలకు సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రధాని బోరిస్ జాన్సన్ జంకుతున్నారు. గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా జాన్సన్ మంత్రి వర్గంలోని కొందరు నియమాలను ఉల్లంఘించడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీ మద్దతుపై ఆయన ఆధారపడటం కూడా ఒక కారణంగా కనిపిస్తున్నది.