యునైటెడ్ నేషన్స్, ఏప్రిల్ 5: తమ దేశంపై రష్యా సాగించిన దురాగతాలను నిరోధించడంలో ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఘోరంగా విఫలమైందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణం స్పందించి రష్యాను శిక్షించాలని.. అది చేయలేకుంటే ఐరాసను రద్దు చేసుకోవాలని అన్నారు. భద్రతా మండలి నుంచి రష్యాను తొలగించాలని కోరారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన తొలిసారిగా ఐరాస భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) సమావేశంలో వర్చువల్గా మాట్లాడారు. బుచా నగరంలో రష్యా సేనలు మారణహోమానికి పాల్పడ్డాయని, వందలాది మందిని ఉద్దేశపూర్వకంగా చంపేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రష్యా బలగాలను జెలెన్స్కీ ఉగ్రవాదులతో పోల్చారు. తమ దేశంలో రష్యా సైనికులు సాగించిన అరాచకాలు, ఐసిస్ ఉగ్రవాదుల దారుణాలకు మధ్య పెద్ద తేడా ఏమీ లేదని అన్నారు. భద్రతా మండలిలో వీటో అధికారం ఉన్న దేశంతో తాము పోరాడుతున్నామని అన్నారు. యూఎన్ఎస్సీని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఐరాసలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి యూఎన్ఎస్సీలో మాట్లాడుతూ బుచా నగరంలో పౌరుల హత్యలను నిస్సందేహంగా ఖండిస్తున్నామన్నారు. ఆయా ఘటనలపై స్వతంత్ర దర్యాప్తు డిమాండ్కు మద్దతు పలుకుతున్నట్టు తెలిపారు.
ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న దాడులు అక్కడి ప్రజలను కుంగదీస్తున్నాయి. తాము మరణిస్తే, కన్నబిడ్డల పరిస్థితి ఏమిటని అక్కడి తల్లిదండ్రులు తీవ్ర కలతతో ఉన్నారు. దాడుల్లో ఒకవేళ తమకు ఏమైనా జరిగితే, తమ పిల్లలను గుర్తించడానికి వీలుగా వారి వీపుపై పేరు, అడ్రస్ను రాసిపెడుతున్నారు. ఓ చిన్నారి వీపుపై తల్లి వివరాలు రాసిన ఫొటో ఒకటి వైరల్గా మారింది.