కీవ్: రష్యా దురాక్రమణపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే)ను ఉక్రెయిన్ ఆశ్రయించింది. అక్రమంగా తమ దేశంపై దాడి చేసి మారణ హోమాన్ని సృష్టిస్తున్న రష్యాపై చర్యలు కోరుతూ ఐసీజేకు దరఖాస్తు చేసింది. సైనిక కార్యకలాపాలను తక్షణం నిలిపివేసేలా రష్యాను ఆదేశించే అత్యవసర నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించింది. తమ దరఖాస్తుపై విచారణ వచ్చే వారంలో ప్రారంభమవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.
కాగా, ఉక్రెయిన్తో రష్యా యుద్ధం ఆదివారం నాటికి నాలుగో రోజుకు చేరింది. ఆ దేశంపై అన్నివైపుల నుంచి దాడిని తీవ్రం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ తన ఆర్మీని ఆదేశించారు. అలాగే ఉక్రెయిన్లో తెగువ చూపుతున్న సాయుధ, ప్రత్యేక ఆపరేషన్ బలగాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు రష్యా దళాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపునకు దూసుకెళ్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ రెండో పెద్ద నగరమైన ఖార్కీవ్కు రష్యా దళాలు చేరాయి. అయితే ఉక్రెయిన్ ఆర్మీ కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నది. ఖార్కీవ్లోని ఒక స్కూల్లో దాగిన రష్యన్ దళాలతో ఉక్రెయిన్ సైన్యం, వాలంటీర్లు పోరాడారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
In #Kharkiv, volunteers and the #Ukrainian Armed Forces are fighting the occupants hiding in a school. pic.twitter.com/oGDJSa7brt
— NEXTA (@nexta_tv) February 27, 2022