కీవ్: పొరుగు దేశమైన బెలారస్లో చర్చలకు రష్యా చేసిన ప్రతిపాదనను ఉక్రెయిన్ తిరస్కరించింది. తమ దేశంపై యుద్ధం కోసం రష్యా సైనికుల మోహరింపునకు బెలారస్ సహకరించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆ దేశంలో కాకుండా మరే ఇతర దేశాల్లో చర్చలకు తాము సిద్ధమేనని తెలిపారు. వార్సా, బ్రాటిస్లావా, ఇస్తాంబుల్, బుడాపెస్ట్ లేదా బాకు వంటి రాజధానులను చర్చలకు ప్రత్యామ్నాయ వేదికలుగా ఆయన సూచించారు. రష్యా దళాలు తమ పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని, నివాస భవనాలపై బాంబులతో దాడులు చేస్తున్నాయని ఆరోపించారు.
కాగా, ఆదివారం నాటికి ఉక్రెయిన్తో రష్యా యుద్ధం నాలుగో రోజుకు చేరింది. ఆ దేశంపై ముప్పేట దాడిని తీవ్రం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ తన ఆర్మీని ఆదేశించారు. అలాగే ఉక్రెయిన్లో తెగువ చూపుతున్న సాయుధ, ప్రత్యేక ఆపరేషన్ బలగాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు రష్యా దళాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపునకు దూసుకెళ్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ రెండో పెద్ద నగరమైన ఖార్కివ్కు రష్యా దళాలు చేరాయి. దీంతో ఉక్రెయిన్ ఆర్మీ కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నది. రాజధాని నగరం కీవ్ మొత్తం తమ ఆధీనంలోనే ఉన్నదని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది.