నిర్లక్ష్యపు వైద్యుడిపై కోర్టుకెక్కి గెలిచిన లండన్ యువతి ఈవీ టూంబెస్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అవయవ లోపాలతో, తీవ్ర అనారోగ్య సమస్యలతో పిల్లలు పుట్టిన ఘటనలు చాలా చూసి ఉంటాం. అంతా ‘మా తలరాత’ అని తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. కానీ లండన్లో ఓ యువతి తమ తల్లికి వైద్యం చేసిన డాక్టర్పై కోర్టుకెక్కింది. ‘ఆ డాక్టర్ సరైన సలహా ఇచ్చి ఉంటే నేను పుట్టాల్సిందే కాదు. ఇన్ని బాధలు పడాల్సిందే కాదు. నాకు పరిహారం కావాలి’ అని వాదించి గెలిచింది. చిత్రంలో కనిపిస్తున్న ఈ యువతి పేరు ఈవీ టూంబెస్(20). వెన్నెముక నిర్మాణంలో లోపాలతో ఆమె జన్మించారు. దీనికి డాక్టర్ ఫిలిప్ మిచెల్ కారణం అని ఈవీ వాదించారు. తాను తల్లి కడుపులో పడకముందే.. తల్లికి రక్తహీనత ఉందని, ఈ సందర్భంలో గర్భం ధరిస్తే బిడ్డకు నష్టం అని చెప్పి ఉండాల్సిందని పేర్కొన్నది. సరైన సలహా ఇస్తే తన తల్లి గర్భధారణను వాయిదా వేసుకొనేవారని చెప్పింది. ఈ వాదనను లండన్ కోర్టు అంగీకరించింది.