కంపాలా: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఇప్పటికే మొదటి వేవ్, రెండో వేవ్ అతలాకుతలం చేయగా.. ఇప్పుడు మూడో వేవ్ ఉధృతమవుతున్నది. ఈ రెండేండ్ల కాలంలో దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల్లో కఠిన ఆంక్షలు అమలయ్యాయి. లాక్డౌన్లు, వీకెండ్ లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యూలతో ప్రజలు ముప్పుతిప్పలు అనుభవించారు. విద్యార్థుల చదువులు దెబ్బతిన్నాయి. భారత్ లాంటి కొన్ని దేశాల్లో కేసులు తగ్గినప్పుడు స్కూళ్లను పునఃప్రారంభించినా, మరికొన్ని దేశాల్లో మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గకపోవడంతో సుదీర్ఘకాలం లాక్డౌన్లు కొనసాగాయి.
ఆఫ్రికా ఖండంలోని తూర్పుదేశం ఉగాండాను కూడా కొవిడ్ మహమ్మారి సుదీర్ఘ కాలం పట్టిపీడించింది. దాంతో 2020 మార్చి నుంచి 2022 జనవరి 10 వరకు దాదాపు రెండేండ్లపాటు అక్కడ లాక్డౌన్ కొనసాగింది. ప్రపంచంలో అత్యధిక కాలం లాక్డౌన్లో ఉన్న దేశం ఉగాండానే కావడం గమనార్హం. అత్యంత సుదీర్ఘ లాక్డౌన్ ముగియడంతో అక్కడి స్కూళ్లను తిరిగి తెరిచారు. దాంతో ఉగాండా రాజధాని కంపాలాలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎక్కడ చూసిన బోర్డింగ్ స్కూళ్ల పిల్లలు బ్యాగులు, పక్కబట్టలు మోసుకెళ్తూ కనిపించారు.
ఉగాండాలో పాఠశాలలు గత 83 వారాల నుంచి మూతపడి ఉన్నాయి. ఈ ప్రభావం ఆ దేశంలోని కోటి మంది విద్యార్థులపై పడింది. నాలుగు కోట్ల 40 లక్షల మంది జనాభా ఉన్న ఉగాండా దేశంలో చాలామటుకు మారుమూల గ్రామాలు ఉన్నాయి. అందువల్ల ఆన్లైన్ క్లాసులు బోధించడానికి సరైన ఇంటర్నెట్ సౌకర్యం లేదు. కొన్నిచోట్ల ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్లు ఇప్పించే పరిస్థితుల్లో లేరు. దాంతో లాక్డౌన్ కొనసాగినన్ని రోజులు ఉగాండాలో విద్యార్థులకు చదువన్నదే లేకుండా పోయింది. ఎట్టకేలకు ఇప్పుడు బడులు తెరుచుకోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.