America | అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. న్యూయార్క్లోని బఫెలో ప్రాంతంలో చోటు చేసుకున్న కాల్పుల ఘటన మరవక ముందే మరో రెండు ప్రాంతాల్లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. అమెరికాలోని హ్యుస్టన్ మార్కెట్లో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బహిరంగ మార్కెట్లో కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే రెండు గ్రూపుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణమే కాల్పులకు దారి తీసిందని పేర్కొన్నారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని, వారిద్దరి నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాల్పులు జరిపినవారు, గాయపడ్డవారు అందరూ 20 ఏండ్లలోపు వారని పోలీసులు తెలిపారు.
దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ చర్చిలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కాల్పుల ఘటన కేసులో ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అమెరికాలో 18 ఏండ్ల శ్వేత జాతి యువకుడు నల్లజాతీయులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోరానికి పాల్పడుతున్న సమయంలో నిందితుడు లైవ్ స్ట్రీమింగ్ చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. న్యూయార్క్లోని బఫెలో ప్రాంతంలోని ఓ సూపర్ మార్కెట్లో ఈ దారుణం జరిగింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.