న్యూఢిల్లీ: తుర్కియేను వరుస భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున పది నిమిషాల వ్యవధిలో 7.8, 7.6 తీవ్రతతో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఆ భూకంపాల ధాటికి భారీ భవంతులు కుప్పకూలాయి. జనం మంచి నిద్రలో ఉన్న సమయంలో భూకంపాలు చోటుచేసుకోవడంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది.
నిద్రలో ఉన్నవాళ్లు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని నరకయాతన అనుభవిస్తున్నారు. భవన శిథిలాల కింద ఉన్న మృతదేహాలను, క్షతగాత్రులను వెలికి తీసేందుకు నిన్నటి నుంచి ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. భారత్ సహా పలు దేశాలు ఈ రెస్క్యూ ఆపరేషన్లో తమ వంతు సాయం అందిస్తున్నాయి.
ఈ సెర్చింగ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో ఇప్పటివరకు ఐదు వేలకుపైగా మృతదేహాలు లభ్యమయ్యాయి. లక్షల మంది తీవ్ర గాయాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నమే 7.5 తీవ్రతలో మూడోసారి భూమి కంపించింది. ఇవాళ ఉదయం 5.9 తీవ్రతతో నాలుగో భూకంపం, మధ్యాహ్నం 5.4 తీవ్రతో ఐదో భూకంపం చోటుచేసుకున్నాయి. దాంతో ఇంకా ఏ ఉపద్రవం ముంచుకు రానుందోనని టర్కీ వాసులు ఆందోళన చెందుతున్నారు.