బీజింగ్: డ్రాగన్ దేశం చైనాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మటన్ పేరుతో పిల్లుల మాంసాన్ని విక్రయిస్తుండటం ఆ దేశంలో కలకలం రేపింది. దాంతో దేశంలో జంతు రక్షణ చట్టాలు, ఆహార భద్రత మరోసారి చర్చకు దారి తీశాయి. దాదాపు 1,000 పిల్లులను కబేళాకు తరలిస్తుండగా చైనా పోలీసులు పట్టుకున్నారు. పిల్లి మాంసాన్ని పంది మాంసంగా, మేక మాంసంగా విక్రయించే అక్రమ ముఠా గుట్టు రట్టు చేశారు.
ఈ నెల ప్రారంభంలో జంతు పరిరక్షణ కార్యకర్తల సూచన మేరకు తూర్పు చైనీస్ ప్రావిన్స్ అయిన జియాంగ్సులోని జాంగ్జియాగాంగ్లో మటన్, పోర్క్ దుకాణాలపై అధికారులు దాడులు చేశారు. పిల్లుల మాంసాన్ని మటన్ గా నమ్మించి దేశంలోని దక్షిణ ప్రాంతానికి సరఫరా చేస్తున్నారని గుర్తించారు. దక్షిణ చైనా ప్రావిన్స్లోని గ్వాంగ్డాంగ్లో ఇంతకుముందు ఇలాంటి అక్రమ వ్యాపారాలను నిలిపివేసినట్లు జంతు సంరక్షణ ఉద్యమకర్త హాన్ జియాలీ చెప్పారు.
కాగా, జాంగ్జియాగాంగ్ నగరంలోని కబేళాలో భారీ ఎత్తున పిల్లులు వేలాడదీసి ఉండటంతో అనుమానం వచ్చిన యానిమల్ రైట్స్ ప్రొటెక్షన్ కార్యకర్తలు నిఘా వేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒక ట్రక్కులో అక్రమంగా రవాణా చేస్తుండగా ఈ పిల్లులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. తాజా ఘటనతో ఆహార భద్రతపై చైనీయులలో ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి.
సోషల్ మీడియా సంస్థ వీబోలో కూడా తాజా ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇది తిన్న మనుషులకు భయంకరమైన చావు తప్పదని ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా, ఈ దేశంలో పిల్లులకు, కుక్కలకు జీవించే హక్కు లేదా అని మరో నెటిజన్ ప్రశ్నించారు. చచ్చినా ఇకపై బార్బెక్యూ మాంసం తినను అని మరొక యూజర్ కామెంట్ చేశాడు.