గాజా, ఏప్రిల్ 26 : యుద్ధం అంటేనే విధ్వంసం, వినాశనం. గత కొన్ని ఏండ్లుగా గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంతో ఇప్పటికే వేలాది మంది మరణించగా, పలువురు నిరాశ్రయులయ్యారు. మృతులలో పిల్లలు, మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక గాయపడిన పిల్లలు అయితే చాలామంది ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. ‘యుద్ధంలో తమ పిల్లలు మరణించి ఉన్నా బాగుండు’ అని కొందరు తల్లులు ఆవేదనతో అంటున్న మాటలు ప్రస్తుత దయనీయ పరిస్థితిని వెల్లడిస్తున్నది. చాలామంది పిల్లలు తీవ్ర శారీరక, మానసిక గాయాలతో బాధపడుతున్నారు. శారీరక గాయాలకు చికిత్స జరుగుతున్నా.. మానసిక గాయాలకు మందు వేసే వారే కరువయ్యారు. ప్రస్తుతం గాజాలోని పిల్లల్లో చాలామంది సరిగ్గా మాట్లాడలేక పోతున్నారు. అల్జజీరా కథనం ప్రకారం.. గాజాలో పెద్దయెత్తున జరిగిన బాంబు దాడులతో పలువురు పిల్లలు దివ్యాంగులుగా మారి శారీరక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
తలపై గాయాలు, నాడీ సంబంధిత నష్టాలు, పేలుడు గాయాల ప్రభావం పిల్లల్లో బయటపడుతున్నాయి. పిల్లల మానసిక చికిత్సా నిపుణుడు కాట్రిన్ గ్లాట్జ్ బ్రుబాక్ దీనిని విధ్వంసం తీవ్రత కింద దాగి ఉండే నిశ్శబ్ద వేదనగా పేర్కొన్నారు. పిల్లలు పడుతున్న ఈ బాధలన్నీ కేవలం శారీరక గాయాల వల్ల ఏర్పడినవి కావని, యుద్ధ విధ్వంసం, తీవ్రత, బాంబు భయాలు, పేలుళ్ల కారణంగా ఏర్పడే షాక్, భయం నుంచి వచ్చినవని తెలిపారు. అప్పటివరకు మామూలుగానే మాట్లాడే పిల్లలు బాంబు దాడులు లాంటి ఘటనలు చూసిన తర్వాత, తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన తర్వాత మాట్లాడే శక్తిని కోల్పోతున్నారు. అలాంటి సమస్యలకు త్వరగా చికిత్స అందించకపోతే దాని ప్రభావం వారి జీవితమంతా చూపించి బాధపెడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతం గాజాలోని దవాఖానల్లో మానసిక ఆరోగ్యం, స్పీచ్ థెరపీ లాంటి ప్రత్యేక సేవలు లభ్యం కాకపోవడంతో పిల్లలను చూసి తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతంగా ఉంది. గాజాలోని పిల్లలందరికీ మానసిక చికిత్స, సహకారం అందించకపోతే ఒక తరం అంతా మానసిక గాయాలతో పెరుగుతారని, కనీసం మాట్లాడేందుకు వారికి గొంతుక కూడా ఉండకపోవచ్చునని వారు హెచ్చరిస్తున్నారు.