బీజింగ్: ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ బీఏ.2 వేరియంట్ దీనికి కారణంగా భావిస్తున్నారు. అయితే ప్రత్యేకించి ఐదు ఆసియా దేశాల్లో కరోనా కేసులు ఆకస్మికంగా పెరిగాయి. చైనా, సింగపూర్, హాంగ్ కాంగ్, దక్షిణ కొరియా, మయన్మార్లో కరోనా వ్యాప్తి, కొత్త కేసుల నమోదు బాగా పెరిగింది. చైనాలోని పలు ప్రావిన్స్లను ఒమిక్రాన్ సబ్ వేరియంట్ వణికిస్తున్నది. సుమారు రెండేండ్ల తర్వాత ఆ దేశంలో కరోనా మరణం నమోదు కావడం కలకలం రేపింది.
మరోవైపు దక్షిణ కొరియాలో కరోనా కేసుల తీవ్రత ఆందోళన రేపుతున్నది. శనివారం కూడా నాలుగు లక్షలకు దగ్గరగా 3,81,454 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 90,38,938కి చేరింది. అలాగే హాంగ్ కాంగ్లో శనివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 16,597 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ముందు రోజు నమోదైన 20 వేల కేసుల కంటే ఈ సంఖ్య తక్కువేనని ఆ దేశ అధికారులు తెలిపారు.
సింగపూర్లో శనివారం కొత్తగా 10,244 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య పది లక్షలు దాటి 10,07,158కు చేరింది. శనివారం ముగ్గురు వ్యక్తులు కరోనాతో మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,194కు చేరిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మయన్మార్ను కూడా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2 వణికిస్తున్నది. శనివారం కొత్తగా 31 కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.