బుచారెస్ట్, జనవరి 18: రొమేనియాలోని వింత రాళ్లు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఆ దేశ రాజధాని బుచారెస్ట్కు 50 మైళ్ల దూరంలో ఉన్న కోస్టెస్టీ అనే గ్రామంలో ఈ వింత రాళ్లు ఉన్నాయి. వీటిని ట్రోవాంట్స్ అని పిలుస్తారు. ఈ రాళ్లకు ప్రాణం ఉంటుందని ఇక్కడి స్థానికులు విశ్వసిస్తారు. వీరి విశ్వాసాన్ని చాలామంది నమ్మకపోవచ్చు. కానీ, ఈ రాళ్ల స్వభావం మాత్రం ఒక ప్రాణమున్న జీవిలా, మొక్కలా ఉంటుంది. ఈ రాళ్లు పెరుగుతుంటాయి. శాస్త్రవేత్తలే ఈ విషయాలు చెబుతున్నారు. ఈ రాళ్లు బుడగల్లా ఉంటాయి. ఇవి ప్రతి వెయ్యేళ్లకు రెండు ఇంచులు పెరుగుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
అంతేకాదు, ఒక రాయి నుంచి మరో రాయి పుట్టినట్లుగా కనిపిస్తాయి. ఈ రాళ్ల లోపల పొరలు ఉంటాయి. ఈ పొరలు ఆ రాళ్లు పెరుగుతున్నాయని చెప్పడానికి గుర్తుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ రాళ్లు ఇసుకలో ఉన్నాయి. ఇక్కడి నుంచి వాననీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. వాననీటిలోని ఖనిజాల వల్ల జరిగే మార్పులతోనే ఈ రాళ్లు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక్కడి ప్రజలు మాత్రం వీటికి ప్రాణం ఉందనే భావిస్తారు. వీటిని చూడటానికి పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు.