ఇస్లామాబాద్: తాలిబన్లు సాధారణ పౌరులు. వాళ్లేమీ మిలిటరీ కాదు. అలాంటి వాళ్లను పాకిస్థాన్ ఎలా ఏరివేయగలదు అని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పీబీఎస్ న్యూస్ హవర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ మాట్లాడుతూ.. తమ సరిహద్దుల్లో 30 లక్షల మంది ఆప్ఘన్ శరణార్థులు ఉన్నట్లు చెప్పారు. తాము తాలిబన్లకు రక్షణ కల్పిస్తున్నామన్న ఆరోపణలు ఆయన ఖండించారు. దీనిపై వాళ్లు ఎందుకు ఆధారాలు ఇవ్వరు? తాలిబన్లకు పాకిస్థాన్ రక్షణ కల్పిస్తోందని ఆరోపిస్తున్నారు.
ఆ స్థావరాలు ఎక్కడ ఉన్నాయి? పాకిస్థాన్లో 30 లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులు ఉన్నారు. ఇక తాలిబన్లు కూడా సాధారణ పౌరులే. మిలిటరీ కాదు. ఈ శిబిరాల్లో అలాంటి కొందరు పౌరులు ఉంటే.. వాళ్లను పాకిస్థాన్ ఎలా ఏరివేయగలదు అని ఇమ్రాన్ ప్రశ్నించారు. తాలిబన్లకు పాకిస్థాన్ ఆర్థికంగా సాయం చేస్తోందని, ఆయుధాలు సమకూరుస్తోందన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.
తప్పంతా అమెరికాదే..
తప్పంతా అమెరికాదే అని ఈ సందర్భంగా ఇమ్రాన్ అన్నారు. ఆప్ఘనిస్థాన్లో వాళ్ల మిలిటరీని దించి, రాజకీయ సుస్థిరత సాధించడానికి తాలిబన్లతో చర్చిస్తే పరిష్కారం ఎలా వస్తుందని ప్రశ్నించారు. తాలిబన్లతో ముందుగానే అమెరికా రాజకీయ సుస్థిరత కోసం ప్రయత్నించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్లు తాము గెలిచామని అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్లతో రాజీ కష్టమవుతుంది అని ఇమ్రాన్ అన్నారు. తాలిబన్లతో కూడిన ప్రభుత్వంతోనే ఆప్ఘనిస్థాన్లో రాజకీయ సుస్థిరత సాధ్యమవుతుందని ఇమ్రాన్ స్పష్టం చేశారు.