ఇస్లామాబాద్: ఆఫ్ఘనిస్థాన్కు చెందిన తాలిబాన్ మంత్రి (Taliban minister) పాకిస్థాన్ పాస్పోర్ట్ కలిగి ఉన్నాడు. పాక్ పాస్పోర్ట్తో విదేశాల్లో కూడా ఆయన పర్యటించాడు. పాక్ జర్నలిస్ట్ ఇది చూసి కంగుతున్నాడు. ఈ విషయం బయటకు రావడంతో ఈ భారీ స్కామ్పై పాకిస్థాన్ అధికారులు చర్యలు చేపట్టారు. తాలిబాన్ మంత్రితో సహా 40,000 మంది ఆఫ్ఘనిస్థానీ పౌరులు పొందిన పాక్ పాస్పోర్ట్లను రద్దు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ అంతర్గత మంత్రి సిరాజుద్దీన్ హక్కానీపై ‘గ్లోబల్ టెర్రరిస్ట్’గా ముద్ర ఉంది. హక్కానీ నెట్వర్క్కు అతడు సీనియర్ నాయకుడని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎఫ్బీఐ పేర్కొంది.
కాగా, సిరాజుద్దీన్ హక్కానీకి ఐదేళ్ల పాకిస్థానీ పాస్పోర్ట్ జారీ చేశారు. విదేశీ ప్రయాణాలకు దీనిని వినియోగించాడు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాల నిష్క్రమణకు దారితీసిన దోహా ఒప్పందంపై సంతకం చేసేందుకు అమెరికాతో చర్చల కోసం ఖతార్కు వెళ్లాడు. ఈ పర్యటనకు కూడా పాకిస్థాన్ పాస్పోర్టును వినియోగించాడు.
మరోవైపు దోహాకు అదే విమానంలో ప్రయాణించిన పాకిస్థాన్కు చెందిన ఓ జర్నలిస్ట్ ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద ఈ విషయాన్ని గ్రహించాడు. దీంతో సిరాజుద్దీన్ హక్కానీ వద్ద పాకిస్థాన్ పాస్పోర్ట్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ప్రభుత్వ హయాంలో పెషావర్లోని పాస్పోర్ట్ కార్యాలయం హక్కానీకి ఈ పాస్పోర్ట్ జారీచేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ నేపథ్యంలో తాలిబాన్ మంత్రి సిరాజుద్దీన్ హక్కానీతో సహా 40,000 మంది ఆఫ్ఘనిస్థానీ పౌరులు అక్రమంగా పొందిన పాక్ పాస్పోర్ట్లను తాజాగా రద్దు చేశారు.