తైవాన్: తైవాన్ గగనతలంలోకి చైనా విమానాలు చొరబడ్డాయి. శనివారం తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్లోకి సుమారు 39 చైనా సైనిక విమానాలు ప్రవేశించినట్లు ఆ దేశం పేర్కొన్నది. రెండు వేవ్ల రూపంలో చైనా విమానాలు తమ దేశంలోకి ఎంటర్ అయినట్లు తైవాన్ రక్షణశాఖ చెప్పింది. తమ డిఫెన్స్ జోన్లోకి శుక్రవారం కూడా 38 విమానాలు వచ్చాయని, వాటిల్లో అణ్వాయుధ బాంబర్లు కూడా ఉన్నట్లు తైవాన్ వెల్లడించింది. ప్రజాస్వామ్య తైవాన్ దేశం తమ ప్రాంతమే అని చైనా భావిస్తోంది. కానీ తైవాన్ మాత్రం తనకు తాను వేరు దేశంగా చూసుకుంటోంది. చైనా వైమానిక దళం గత ఏడాది నుంచి చేపడుతున్న మిషన్ల గురించి తైవాన్ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నది. కావాలనే ఆ దేశం సైనిక దూకుడుకు పాల్పడుతోందని, ప్రాంతీయ శాంతిని ఆ దేశం విచ్ఛిన్న చేస్తున్నట్లు తైవాన్ ప్రధాని సు సెంగ్ చాంగ్ తెలిపారు. శనివారం ఉదయం పూట సుమారు 20 చైనా విమానాలు తైవాన్ డిఫెన్స్ జోన్లోకి చొరబడ్డాయి. ఇక అదే రోజున సాయంత్రం మరో 19 విమానాలు ఎంటర్ అయినట్లు తైవాన్ చెప్పింది. ప్రటాస్ ఐలాండ్ వద్ద పీఎల్ఏ విమానాలు ఎగిరినట్లు తైవాన్ ఆరోపించింది.