సూయజ్ (ఈజిప్టు), మార్చి 29: ప్రపంచ దేశాలకు కునుకులేకుండా చేసిన రాకాసి నౌక కథ సుఖాంతమైంది. ఈజిప్టులోని ‘సూయజ్’ కాలువలో చిక్కుకొని ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిన జపాన్కు చెందిన భారీ సరుకు రవాణా నౌక ‘ఎవర్ గివెన్’ సోమవారం ఎట్టకేలకు కదిలింది. నౌక ప్రయాణంలో ఏర్పడ్డ అవాంతరాలను పరిష్కరించామని సూయజ్ కెనాల్ అథారిటీ (ఎస్సీఏ) సోమవారం వెల్లడించింది. గ్రేట్ బిట్టర్ సరస్సు వైపునకు నౌక ప్రయాణం మొదలైందని పేర్కొంది. ‘భారీ నౌకను మేము సరైన మార్గంలోకి తరలించాం. ఎస్సీఏతో కలిసి మేము చేపట్టిన వ్యూహం ఫలించింది’ అని నిర్మాణ సంస్థ బోస్కలియాస్ సీఈవో పీటర్ బెర్డోవ్స్కీ పేర్కొన్నారు. దాదాపు 20 వేల కంటైనర్లతో ఆసియా నుంచి ఐరోపాలోని నెదర్లాండ్స్కు వెళ్తున్న ఎవర్ గివెన్ నౌక.. గత మంగళవారం సూయిజ్ కాలువలో అడ్డంగా తిరిగి జిగురులాంటి మన్ను, ఇసుకలో చిక్కుకున్న విషయం తెలిసిందే. నౌకను సరైన మార్గంలో ప్రవేశపెట్టేందుకు డచ్ నిర్మాణ సంస్థ బోస్కలియాస్కు చెందిన ‘స్మిత్ సాల్వేజ్’ కంపెనీకి పనులు అప్పగించారు. ఎస్సీఏ సహకారంతో వారంలోగా ఈ సంస్థ నౌకను కదిలేలా చేసింది. కాగా ‘ఎవర్ గివెన్’ కారణంగా కనీసం 367 నౌకలు నిలిచిపోయాయి. గడిచిన ఏడు రోజుల్లో సుమారు రూ.4.86 లక్షల కోట్ల వ్యాపారంపై ప్రభావం పడింది.
ఎలా బయటకు తీశారు?
ఆ సరస్సు వైపునకే ఎందుకు?
కాలువలో అవాంతరాన్ని దాటుకొని తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించిన ‘ఎవర్ గివెన్’ సరుకును బట్వాడా చేయాల్సిన నెదర్లాండ్స్లోని రోటెర్డామ్ పట్టణానికి చేరుకోవడానికి ముందు.. సూయజ్ కాలువ మధ్యలో ఉన్న గ్రేట్ బిట్టర్ సరస్సు ప్రాంతంలో ఆగుతుందని ఎస్సీఏ అధికారులు తెలిపారు. అక్కడ నౌకకు సాంకేతిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. కాలువ ఒడ్డున మట్టిలో కూరుకుపోవడం వల్ల ఓడ ముందు భాగం ఏమైనా దెబ్బతిన్నదా? తదితర అంశాలను ఈ తనిఖీలో పరిశీలించి, ఆ తర్వాత నౌక ప్రయాణంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇప్పట్లో ట్రాఫిక్ సమస్య తీరదు
‘ఎవర్ గివెన్’ కారణంగా సూయజ్ కాలువ ఇరుపక్కలా కనీసం 367 నౌకలు నిలిచిపోయాయని ఆర్థిక సేవల సంస్థ ‘రెఫినిటివ్’ తెలిపింది. గొర్రెలు, ముడి చమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ, ఫర్నిచర్, దుస్తులు, ఇతర సరుకులను ఈ నౌకలు రవాణా చేస్తున్నట్టు పేర్కొంది. ఈ ట్రాఫిక్ను పూర్తిగా క్రమబద్ధీకరించేందుకు పదిరోజుల కంటే ఎక్కువ సమయం పట్టొచ్చని అంచనా వేసింది. అయితే, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఎక్కువ సమయం పడుతున్న క్రమంలో కాలువ ముఖ ద్వారం దగ్గర ఉన్న కొన్ని నౌకలు ప్రత్యామ్నాయ మార్గం (ఆఫ్రికా చుట్టూరా తిరిగి ప్రయాణం) గుండా వెళ్లేందుకు సిద్ధమయ్యాయని ‘రెఫినిటివ్’ ప్రతినిధులు తెలిపారు. దీంతో ఆ నౌకలు 5 వేల కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి ఉంటుందని.. దీనికి కూడా రెండు వారాల సమయం పడుతుందని వెల్లడించారు.
ఇవీ కూడా చదవండి..
జీశాట్-1 లాంఛ్ షెడ్యూల్ను సవరించిన ఇస్రో
మహారాష్ట్రలో రికార్డుస్థాయిలో ఒకే రోజు 37 వేల కరోనా కేసులు