హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): భారత్, శ్రీలంక మధ్య ఉన్న పాక్ జలసంధిని ఈది రికార్డు సృష్టించిన గోలి శ్యామలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. గోలి శ్యామల ఆదివారం హైదరాబాద్లోని కవిత నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. పాక్ జలసంధిని ఈదిన రెండో మహిళగా శ్యామల రికార్డు సృష్టించడం గర్వకారణమని మెచ్చుకున్నారు. శ్యామల మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత తనకు రోల్మోడల్ అని, మధ్యతరగతి కుటుంబానికి చెందిన తనను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. తన ఎదుగుదలలో వెన్నంటే ఉంటున్న ఆమెకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. కాగా 47 ఏండ్ల శ్యామల ఇటీవల 13 గంటల 43 నిమిషాల్లో 30 కిలోమీటర్ల దూరాన్ని ఈదిన తొలి తెలుగు మహిళగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.