కొలంబో, జూన్ 16: శ్రీలంక దేశం గురువారం ‘స్టాప్ అదానీ’ అని నినదించింది. మన్నార్ విద్యుత్తు ప్రాజెక్టును అక్రమంగా అదానీ గ్రూప్నకు అప్పగించడంపై శ్రీలంక ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. కొలంబోలో వేలాది మంది భారీ నిరసన ప్రదర్శన చేపట్టా రు. శ్రీలంక ప్రభుత్వానికి, అదానీ గ్రూప్నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత ప్రధాని మోదీ, శ్రీలంక అధ్యక్షుడు గొటబయ మధ్య రహస్యంగా జరిగిన ఒప్పందంతోనే అదానీకి మన్నార్ విద్యుత్తు ప్రాజెక్టు దక్కిందని ఆరోపించారు. దీన్ని రద్దు చేసి మళ్లీ బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
‘మోదీ, గొటబయ మధ్య అక్రమంగా జరిగిన ఈ ఒప్పందం చట్ట విరుద్ధమైనది. ఎలాంటి పోటీ లేకుండా అదానీ గ్రూప్నకు ప్రాజెక్టును కట్టబెట్టేందుకు శ్రీలంక పార్లమెంటు ఎలక్ట్రిసిటీ చట్టానికి సవరణలు చేసింది. ఇది సరైంది కాదు. మళ్లీ బిడ్డింగ్ నిర్వహించాలి’ అని పీపుల్స్ పవర్ సివిల్ సొసైటీ గ్రూప్లో సభ్యుడిగా ఉన్న న్యూలీ హమీమ్ అన్నారు. ‘మేం పునరుత్పాదక ఇంధనాన్ని వ్యతిరేకించడం లేదు. కానీ అదానీ గ్రూప్నకు ప్రాజెక్టు కట్టబెట్టడంలో అవినీతి జరిగింది. దానిపైనే మా పోరాటం’ అని అంజనీ వాందురంగాలా అనే సిటిజన్ అన్నారు. ‘ప్రస్తుత కరెంటు సంక్షోభంలో మాకు పునరుత్పాదక విద్యుత్తు చాలా అవసరం. కానీ అవినీతికి ఆస్కారం లేకుండా దీన్ని సాధించాల్సి ఉంది. అనుమానాస్పద ఒప్పందాలకు అదానీ కంపెనీ పెట్టింది పేరు’ అని సెరెనా బర్గీస్ అనే మహిళ పేర్కొన్నారు.
అదానీ గ్రూప్నకు మన్నార్ ప్రాజెక్టు అప్పగించేలా శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై ప్రధాని మోదీ ఒత్తిడి చేశారని సీలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు మాజీ చైర్మన్ ఫెర్డినాండో ఇటీవల ప్రకటించడంతో శ్రీలంకలో దుమారం రేగింది. ఈ ఆరోపణలను రాజపక్స ఖండించారు. ఫెర్డినాండో కూడా వ్యాఖ్యలను ఉపసంహరించుకొన్నారు. అయితే మన్నార్ ప్రాజెక్టు అనుమతి ప్రక్రియను వేగవంతం చేయాలని ఫెర్డినాండో 2021 నవంబర్ 25న ఆ దేశ ఆర్థిక శాఖను లేఖ ద్వారా కోరినప్పుడు.. ‘అదానీ గ్రూప్ను గుర్తించాలని అధ్యక్షుడి ఆదేశాలున్నాయి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. వివా దం నేపథ్యంలో ఫెర్డినాండో పదవి నుంచి వైదొలిగారు. కాగా, ఈ వివాదంపై మోదీ సర్కారు స్పందించలేదు.
శ్రీలంక ఉత్తరతీర ప్రాంతంలోని మన్నార్లో 500 మెగావాట్ల సామర్థ్యమున్న సోలార్, పవన విద్యుత్తు ప్రాజెక్టును అదానీ గ్రూప్కు ఏకపక్షంగా కట్టబెట్టడంపై ఆ దేశంలో వివాదం రేగింది. భారత ప్రధాని నరేంద్రమోదీ.. శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై ఒత్తిడి తేవడంతోనే ఎలాంటి పోటీ లేకుండా అదానీ గ్రూప్కు ఈ ప్రాజెక్టును కేటాయించారనేది ప్రధాన ఆరోపణ. సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) చైర్మన్ ఫెర్డినాండో ఇటీవల ఆ దేశ పార్లమెంటరీ కమిటీ ముందు ఇచ్చిన వాంగ్మూలంతో ఈ విషయం బయటకు వచ్చింది. గొటబయ స్వయంగా తనతో ఈ విషయం చెప్పారని ఫెర్డినాం డో వెల్లడించారు. ఫెర్డినాండో ఇచ్చిన వాంగ్మూలం వీడియోను శ్రీలంక టీవీ చానల్ న్యూస్ ఫస్ట్ ప్రసారం చేయటంతో కలకలం రేగింది. అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో వనరుల దోపిడీపై పక్కా ఆధారం బయటపడటంతో దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ కాంట్రాక్టును రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ సీఈబీ ఉద్యోగులు, ఇంజినీర్లు ఏకంగా సమ్మె నోటీస్ ఇచ్చారు. ఎంవోయూ సమయంలో యూనిట్ విద్యుత్తును 6.50 అమెరికన్ సెంట్లకు సీఈబీకి విక్రయించేలా అదానీ గ్రూప్తో ఒప్పందం కుదిరింది. ఈ ధరను అదానీ గ్రూప్ 7.55 సెంట్లకు పెంచేసింది. ఈ ప్లాంటును అంతర్జాతీయ పోటీ బిడ్ల ద్వారా అప్పగిస్తే 4 సెంట్లకే యూనిట్ విద్యుత్తు వచ్చేదని, ఇప్పుడు దాదాపు రెట్టింపు ధర చెల్లించాల్సి వస్తున్నదని శ్రీలంక విద్యుత్తు ఇంజినీర్లు మండిపడుతున్నారు. పోటీ లేకపోవటంతో అదానీ గ్రూప్కు 25 ఏండ్లలో 4 బిలియన్ అమెరికన్ డాలర్ల అయాచిత లాభం చేకూరుతుందని అంచనా వేశారు. ఈ వివాదంపై మోదీ ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు.
అదానీ గ్రూప్నకు మన్నార్ ప్రాజెక్టు కట్టబెట్టడంపై శ్రీలంకలో ప్రజా ఉద్యమం నడుస్తున్న వేళ ఆరెస్సెస్ నేత రామ్ మాధవ్ శ్రీలంకలో పర్యటించడం చర్చనీయాంశం అయింది. బుధవారం రామ్ మాధవ్ శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేను కొలంబోలో కలిశారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో శ్రీలంకకు భారత సాయంపై చర్చించారు. అయితే, రామ్ మాధవ్ ప్రభుత్వంలో ఏ పదవిలోనూ లేనప్పటికీ భారత సాయంపై చర్చించడం విమర్శలకు దారితీస్తున్నది.
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): శ్రీలంక ప్రభుత్వ ఉన్నతాధికారులు చేసిన అవినీతి ఆరోపణలపై ప్రధాని మోదీ, అదానీ ఎందుకు స్పందించడం లేదని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేయిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోదీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఏం చేస్తున్నదని అడిగారు. ఈ వ్యవహారంలో మీడియా కూడా తమకు పట్టనట్టుగా ఉందని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.