కీవ్: ఉక్రెయిన్లోని సుమీ కాల్పుల మోతతో మారుమోగుతోంది. దీంతో అక్కడున్న భారత విద్యార్థుల క్షేమంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటన జారీ చేసింది. కాల్పుల తీవ్రత వల్ల అక్కడి నుంచి భారత విద్యార్థుల తరలింపును వాయిదా వేసినట్లు తెలిపింది. అయితే కాల్పుల విరమణ కోసం భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని వెల్లడించింది. అప్పటి వరకు విద్యార్థులు బాంబు షెల్టర్ల లోపలే ఉండాలని, ముందస్తు భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
కాగా, ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో సుమీ ప్రాంతంలోని భారత విద్యార్థులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఆహారం, నీరు లేక అల్లాడిపోతున్నారు. మంచు గడ్డలను మంటతో కరిగించి ఆ నీటిని తాగుతున్నారు. తమను వెంటనే అక్కడి నుంచి తరలించాలని కన్నీళ్లతో వేడుకుంటూ భారత ప్రభుత్వానికి ఎస్ఓఎస్ వీడియో సందేశాలు పంపుతున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్రం వీటిపై స్పందించింది. సుమీలో కాల్పుల విరమణ కోసం భారత ప్రభుత్వం గట్టిగా ఒత్తిడి తెస్తున్నదని తెలిపింది. కాల్పుల విరమణ ప్రకటించగానే విద్యార్థులను అక్కడి నుంచి తరలిస్తామని పేర్కొంది. ఈ లోపు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, షెల్టర్ల లోపలే ఉండాలని సూచించింది.