కొలంబియా: అక్రమంగా దిగుమతి అయిన సుమారు 3,000 టన్నుల చెత్తను బ్రిటన్కు శ్రీలంక తిప్పి పంపింది. సోమవారం చివరిగా 45 కంటైనర్లతో కూడిన కార్గో షిప్ కొలంబియా పోర్టు నుంచి బ్రిటన్కు బయలుదేరింది. పలు ఆసియా దేశాలను డంపింగ్ యార్డులుగా పశ్చిమ దేశాలు వాడుకుంటున్నాయి. టన్నుల కొద్దీ వ్యర్థాలను నౌకల ద్వారా రవాణా చేసి ఆసియా దేశాల్లో పడేస్తున్నాయి. 2017 నుంచి 2019 వరకు బ్రిటన్లోని ఓ కంపెనీ నుంచి శ్రీలంకకు సుమారు మూడు వేల టన్నుల చెత్త చేరింది. వాడేసిన పరుపులు, కార్పెట్లు, రగ్గులుగా ఈ వ్యర్థాలను పేర్కొన్నారు. అక్కడి నుంచి ఇతర దేశాలకు వాటిని పంపుతామని ఆ కంపెనీ తెలిపింది.
కాగా, ఆ కంటైనర్లను తెరిచి చూసిన శ్రీలంక కస్టమ్స్ అధికారులు షాకయ్యారు. ఆసుపత్రుల వ్యర్థాలు, మార్చురీల నుంచి, పోస్ట్మార్టం అనంతరం మిగిలే మానవ శరీర భాగాలు వంటి ప్రమాదకర జీవ వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో అవి నిండి ఉన్నాయి. ఈ కంటైనర్లకు ఏసీలు లేకపోవడంతో వాటి నుంచి దుర్వాసన వచ్చేది. మెడికల్, బయో వ్యర్థాలతో కూడిన 263 కంటైనర్లలో దిగుమతి అయిన 3,000 టన్నుల వ్యర్థాలను ఆ దేశ కస్టమ్స్ అధికారులు పోర్టుల్లో గుర్తించారు. అయితే శ్రీలంక నుంచి తిరిగి వాటిని ఎక్కడికి రవాణా చేస్తారో అన్న దానిపై కస్టమ్స్ అధికారులకు సరైన ఆధారాలు లభించలేదు.
మరోవైపు శ్రీలంక పర్యావరణ కార్యకర్తల గ్రూప్ బయో వ్యర్థాల కంటైనర్లపై కోర్టును ఆశ్రయించింది. అవి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి వాటిని తిప్పి పంపాలని డిమాండ్ చేసింది. 2020లో ఈ పిటిషన్ అపీల్ను శ్రీలంక కోర్టు సమర్థించింది. దీంతో ఆ వ్యర్థాలను బ్రిటన్కు తిప్పి పంపసాగారు. 2020 సెప్టెంబర్లో తొలిసారి 21 కంటైనర్లతో కూడిన మెడికల్ వ్యర్థాలను బ్రిటన్కు తిరిగి పంపారు. నాటి నుంచి దశల వారీగా చెత్తను ఆ దేశానికి తిరిగి రవాణా చేస్తున్నారు. మొత్తం 263 కంటైనర్లలో సోమవారం చివరిగా 45 కంటైనర్ల వ్యర్థాలను రవాణా నౌక ద్వారా కొలంబియా పోర్టు నుంచి బ్రిటన్కు పంపారు.
అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ప్లాస్టిక్తో సహా ప్రమాదకర వ్యర్థాలను కంటైనర్లలో తమ దేశానికి రవాణా చేశారని శ్రీలంక కస్టమ్స్ ఆరోపించింది. 2017, 2018లో తమ దేశానికి దిగుమతి చేసిన 180 టన్నుల వ్యర్థాలను భారత్, దుబాయ్కు తిరిగి పంపినట్లుగా 2019లో తమ దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొంది. ప్రమాదకర వ్యర్థాలతో కూడిన కంటైనర్లను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాలు తాజాగా కూడా జరిగి ఉండవచ్చని ఆ దేశ కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండి అలాంటి వాటికి చెక్ పెడతామని చెప్పారు.
కాగా, గతంలో ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలు కూడా వందలాది చెత్త కంటైనర్లను అవి పంపిన పశ్చిమ దేశాలకు తిప్పిపంపాయి.