కొలంబో: శ్రీలంకలో తీవ్రమైన ఇంధన కొరత ఉన్న విషయం తెలిసిందే. ఆ దేశంలో ఒక్క రోజుకు సరిపడా ఆయిల్ నిల్వలు లేవు. దేశవ్యాప్తంగా ఇప్పుడు పెట్రోల్, డీజిల్కు ఫుల్ డిమాండ్ ఉంది. బంకుల వద్ద జనం బారులు తీరి ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కూళ్లను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగులు ఎవరు కూడా ఆఫీసుకు రావొద్దు అంటూ ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొన్నది. ప్రజా పరిపాలనా మంత్రిత్వశాఖ ఈ ఆదేశాలను జారీ చేసింది. ఇంధన దిగుమతి కోసం ఖజానా లేక శ్రీలంక సర్కార్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఆ దేశంలో రాజకీయ సంక్షోభం కూడా ఏర్పడింది. శ్రీలంకకు ఇప్పటి వరకు 51 బిలియన్ డాలర్ల విదేశీ అప్పు ఉన్నది.