కొలంబో: 2019 మిసెస్ శ్రీలంక వరల్డ్ విజేత కరోలైన్ జూరీని శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. కాలిఫోర్నియాకు చెందిన కంపెనీ మిసెస్ శ్రీలంక వరల్డ్ అందాల పోటీలను గడిచిన ఆదివారం నిర్వహించింది. ఈ పోటీల్లో పుష్పికా డిసిల్వా గెలుపొంది కిరీటాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ అందగత్తెల పోటీ వివాదానికి తెరలేపింది. మిసెస్ శ్రీలంక టైటిల్ గెలిచిన పుష్పికా డిసిల్వా తలపై ఉన్న కిరీటాన్ని అదే స్టేజీపై ఉన్న 2019 మిసెస్ శ్రీలంక విజేత కరోలైన్ జూరీ తీసి దాన్నీ రన్నరప్కు అలంకరించింది.
ఈ చర్య సర్వత్రా విస్మయానికి గురిచేసింది. ఆమె అనుచిత ప్రవర్తన వివాదానికి కూడా దారితీసింది. అయితే మిసెస్ శ్రీలంక అవార్డును కేవలం పెళ్లి అయిన మహిళలకే ఇస్తారని, విడాకులు తీసుకున్నవారికి కాదు అని కరోలినా ఆ స్టేజ్ మీదే పేర్కొన్నది. ఈ నియమం ప్రకారం రన్నరప్కు బ్యూటీ కిరీటం దక్కుతుందని కరోలినా చెప్పింది
రన్నరప్కు బ్యూటీ కిరీటాన్ని తొడగడంతో స్టేజీ మీదున్న విన్నర్ పుష్పిక ఘోర అవమానంతో అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ వివాదంపై విన్నర్ పుష్పిక సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తాను విడాకులు తీసుకోలేదని, ఒకవేళ విడాకులు తీసుకుంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ వివాదాన్ని నిర్వాహకులు పరిష్కరించి అసలైన విన్నర్ పుష్పిక డిసిల్వానే అని తేల్చారు. తాను ఈ ఘటనను క్షమించగలను కానీ మర్చిపోలేను అని డిసిల్వా పేర్కొంది.
స్టేజీపై అవమానకరంగా ప్రవర్తించిన కరోలైన్ జూరీ, ఆమె సన్నిహితుడిని కొలంబో పోలీసులు అరెస్టు చేశారు. జూరీని మిసెస్ అండర్ వరల్డ్ అని రీబ్రాండ్ చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.