మాడ్రిడ్: చైనా ఇటీవల లాంచ్ చేసిన భారీ రాకెట్ శిథిలాలు నియంత్రణ కోల్పోయాయి. వేగంగా దూసుకొస్తున్న అవి భూమిపై కూలనున్నాయి. ఈ నేపథ్యంలో స్పెయిన్లోని పలు విమానాశ్రయాలను మూసివేశారు. చైనా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన రాకెట్, లాంగ్ మార్చ్ 5బీ (సీజెడ్-5బీ) అక్టోబర్ 31న నింగిలోకి దూసుకెళ్లింది. అంతరిక్షంలో చైనా నిర్మిస్తున్న స్పేస్ స్టేషన్కు 20 టన్నుల బరువున్న మెంగ్టియన్ లాబొరేటరీ క్యాబిన్ మాడ్యూల్ను దీని ద్వారా పంపారు.
కాగా, ఈ భారీ రాకెట్ శిథిలాలు భూమిపైకి వేగంగా దూసుకొస్తున్నాయి. కొన్ని భాగాలు శుక్రవారం, మరి కొన్ని భాగాలు శనివారం భూమిపై పడవచ్చని తెలుస్తున్నది. ఈ శిథిలాలు చాలా వరకు అట్లాంటిక్ మహా సముద్రంలో కూలవచ్చని యూరోపియన్ యూనియన్ స్పేస్ సర్వైలెన్స్ అండ్ ట్రాకింగ్ సర్వీస్ అంచనా వేసింది. అయితే ఉత్తర స్పెయిన్, పోర్చుగల్, దక్షిణ ఇటలీలో కూడా రాకెట్ శిథిలాలు కూలే ముప్పు ఉందని హెచ్చరించింది.
మరోవైపు చైనా రాకెట్ శిథిలాల ముప్పు భయంతో స్పెయిన్లోని పలు విమానాశ్రయాలను శుక్రవారం మూసివేశారు. టార్రాగోనా, ఇబిజా, రియస్లో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. బార్సిలోనా విమానాశ్రయంలో శుక్రవారం అంతా మూసివేత కొనసాగనున్నది. బాలేరిక్స్, బ్రిటన్ మధ్య విమాన రాకపోకలు ప్రభావితం కానున్నాయి. లా రియోజా, కాస్టిల్లా, లియోన్తో సహా ఇతర ప్రాంతాల్లో విమాన ప్రయాణాలు ప్రభావితమయ్యాయి. ఫ్రాన్స్లోని మార్సెయిల్ విమానాశ్రయంలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. కాగా, విమానాలు రద్దు కావడం, కొన్నింటిని మళ్లించడంతో యూరప్ దేశాల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.