మొగదిషు: సోమాలియా (Somalia) రాజధాని మొగదిషులోని హోటల్లో తిష్టవేసిన అల్-షహబాబ్ జిహాదిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. శుక్రవారం సాయంత్రం (స్థానిక కాలమానం) మొగదిషులోని హయత్ హోటల్లో చొరబడిన ఉగ్రవాదులు.. హోటల్లో మారణకాండ సృష్టించారు. 13 మంది పొట్టనబెట్టుకోగా, మరికొంతమందిని బందీలుగా పట్టుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన సోమాలియా భద్రతాబలగాలు.. హోటల్లో ఉన్నవారని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో అప్రమత్తమైన తీవ్రవాదులు హోటల్లోని టాప్ ఫ్లోర్ చేరుకుని పోలీసులపై కాల్పులు ప్రారంభించారు. దీంతో ఇరుపక్షాల మధ్య సుమారు 30 గంటలపాటు హోరాహోరీ పోరుజరిగింది. చివరికి పోలీసుల చేతిలో ఉగ్రవాదులు హతమయ్యారు.
కాగా, హయత్ హోటల్పై దాడిని భారత్ ఖండించింది. ఈ దాడి ఉగ్రవాదుల పిరికిపంద చర్యగా పేర్కొంది. ముష్కరుల దాడిలో మరణించినవారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. సోమాలియాకు భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.