కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. అయితే ఆ క్యాబినెట్లో సిరాజుద్దిన్ హక్కానీ ఆ దేశ హోంమంత్రిగా నియమితులయ్యారు. హక్కానీ గ్రూపుకు చెందిన సిరాజుద్దీన్.. ఉగ్రవాద జాబితాలో ఉన్నారు. అమెరికాకు చెందిన ఎఫ్బీఐ లిస్టులో అతను మోస్ట్ వాంటెడ్. ఉగ్రవాది హోంమంత్రి కావడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసిన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్తో లింకు ఉన్న హక్కానీ గ్రూపును స్థాపించిన జలాలుద్దిన్ హక్కనీ కుమారుడే సిరాజుద్దీన్. జలాలుద్దీన్ సోవియేట్ రష్యాకు వ్యతిరేకంగా పోరాటం చేశారు.
సిరాజ్ మేనమామ ఖలీల్ హక్కానీ కూడా మంత్రి అయ్యారు. శరణార్థుల శాఖకు తాత్కాలిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాలిబన్ల ప్రభుత్వంలో ఇద్దరు హక్కానీలకు చోటు దక్కడం పాక్ పాత్రను స్పష్టం చేస్తున్నది. ప్రస్తుతం సిరాజుద్దీన్, ఖలీల్ హక్కానీలు ఇంకా అమెరికా ఉగ్రవాద జాబితాలో ఉన్నారు. వారిద్దరి తలలపై మిలియన్ల డాలర్ల నజరానా ఉన్నది. సిరాజుద్దీన్ హక్కానీ తలపై సుమారు 10 మిలియన్ల డాలర్ల రివార్డు ఉన్నది.
కాబూల్లో 2008లో ఇండియన్ ఎంబసీపై జరిగిన బాంబు దాడిలో హక్కానీ గ్రూపు కీలకంగా నిలిచింది. ఆ దాడిలో 58 మంది మృతిచెందారు. పాక్ ఐఎస్ఐ ఆ దాడులను ప్లానేసినట్లు తేలినా.. ఆ దేశం దాన్ని ఖండించింది. హక్కానీ గ్రూపు రెండు దశాబ్ధాలుగా ఆత్మాహుతి దాడులకు పాల్పడుతోంది. పాశ్చాత దేశాలకు చెందిన వారిని కిడ్నాప్ చేసి భారీ మొత్తాన్ని డిమాండ్ చేయడంలోనూ హక్కానీ గ్రూపు నిమగ్నమైంది. 2017లో కాబూల్లో జరిగిన ట్రక్కు బాంబు దాడిలో 150 మంది మరణించారు. ఆ దాడిలో సిరాజుద్దీన్ ప్రధాన నిందితుడు. హక్కానీ గ్రూపును అమెరికా ఉగ్ర సంస్థగా గుర్తిస్తోంది. ఆల్ఖయిదాతోనూ ఆ సంస్థకు లింకులు ఉన్నాయి.