శాన్ డియాగో: అమెరికాలోని శాన్ డియాగో(San Diego) మసీదులో కాల్పులు ఘటన చోటుచేసుకున్నది. ఇద్దరు టీనేజీ వ్యక్తులు కాల్పులకు తెగించారు. ఆ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ శాన్ డియాగోలో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత నిందితులు ఇద్దరు కూడా గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. విద్వేష నేరం కోణంలో ఈ కేసును పరిశీలిస్తున్నామని శాన్ డియాగో పోలీసు చీఫ్ స్కాట్ వాల్ తెలిపారు. ఏ కారణం చేత టీనేజీ యువకులు కాల్పులకు పాల్పడ్డారో తెలియదని, భవిష్యత్తులో ఈ అంశాలు బయటపడే అవకాశాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. కాల్పులు జరిపిన ఓ యువకుడి తల్లి .. ఘటనకు ముందే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడు మిస్సింగ్లో ఉన్నట్లు చెప్పింది. ఆయుధాలతో పాటు తన వాహనాన్ని తన కొడుకు తీసుకెళ్లినట్లు ఆమె పోలీసులకు చెప్పింది.
ఇస్లామిక్ సెంటర్కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాడిసన్ హై స్కూల్లో ఆ టీనేజర్ చదువుతున్నట్లు తెలిసింది. కాల్పుల ఘటనలో మృతిచెందిన వారిలో ఓ సెక్యూర్టీ గార్డు ఉన్నాడు. ఆయుధాలతో వచ్చిన యువకుడిని ఆ సెక్యూర్టీ గార్డు అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిసింది. అయితే మృతుల సంఖ్య పెరగకుండా ఆ గార్డు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు చెబుతున్నారు. శాన్ డియాగో కౌంటీలో ఇదే అతిపెద్ద మసీదు కావడం విశేషం. శాన్ డియాగో మసీదు ఆవరణలో అల్ రషీద్ స్కూల్ ఉంది. దీంట్లో అరబిక్ భాషతో పాటు ఇస్లామిక్ స్టడీస్ ఉంటాయి. అయిదేళ్ల వయసు దాటిన వారికి ఖురాన్ బోధిస్తారు. అయితే స్కూల్లో పిల్లలు అందరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
కాల్పులకు తెగించిన ఇద్దరు షూటర్లు.. మసీదు సమీపంలోని ఓ వాహనంలో నిర్జీవంగా పడి ఉన్నారు. ఆ మసీదులో రోజుకు అయిదుసార్లు ప్రార్థనలు జరుగుతాయి. ఇతర మత సంస్థలతోనూ కలిసి ఆ మసీదు పనిచేస్తుంది. కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ ముస్లిం సంఘం కాల్పుల ఘటనను ఖండించింది.