Paskistan : అణ్వాయుధాలు కలిగి ఉన్న పాకిస్థాన్ విదేశాలను అప్పు అడగడం సిగ్గు చేటని ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టేందుకు అప్పులు చేయడం సరైన పరిష్కారం కాదని, తీసుకున్న రుణాలను తిరిగి తీర్చక తప్పదని ఆయన తెలిపారు. శనివారం జరిగిన పాకిస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (పీఏఎస్) ప్రొబేషనరీ ఆఫీసర్స్ వేడుకకి ముఖ్య అతిథిగా షరీఫ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. న్యూక్లియర్ పవర్ ఉన్న పాకిస్థాన్ డబ్బుల కోసం విదేశాల దగ్గర చేయి చాచడం సిగ్గుగా ఉందని అన్నారు. ఈమధ్య తాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయాద్ వంద కోట్ల డాలర్లు అప్పుగా ప్రకటించారని షరీఫ్ చెప్పారు. అంతేకాదు ఆర్థిక సాయం చేసినందుకు సౌదీ అరేబియాకు కృతజ్ఞతలు తెలిపారు.
ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్థాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దాంతో, నిత్యావసరాలైన ఆహారం, గ్యాస్, నూనె, పెట్రోల్ వంటి వాటి ధరలు ఆమాంతం పెరిగాయి. గోధుమ పిండి కోసం జనం ఎగబడిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ దేశంలో ఇంధన కొరత ఏర్పడడానికి రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కూడా ఒక కారణం. అంతేకాదు విద్యుత్ ఆదా చేయడం కోసం రాత్రిపూట తొందరగా షాపులు మూసేయాలని పాక్ ప్రభుత్వం ప్రజలను కోరింది.