Saudi Arabia | సౌదీ ప్రభుత్వం తప్పుచేసిన వారికి కఠిన శిక్షలు అమలు చేస్తోంది. ముఖ్యంగా అత్యాచారం, ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలు వంటి నేరాలకు పాల్పడి దోషులుగా తేలితే వారికి బహిరంగంగా మరణ శిక్ష విధిస్తోంది. తాజాగా 12 రోజుల వ్యవధిలో (నవంబర్ 10వ తేదీ నుంచి ఇప్పటి వరకు) 17 మంది నేరస్థులకు బహిరంగంగా ఉరిశిక్షను అమలు చేసినట్లు యూఎన్ అధికార ప్రతినిధి ఎలిజబెత్ త్రోసెల్ ప్రకటించారు. వీరంతా మాదకద్రవ్యాల కేసులో దోషులు అని తెలిపారు.
మరణ శిక్ష విధించిన వారిలో నలుగురు సిరియాకు చెందిన వారు కాగా, ముగ్గురు పాకిస్థానీయులు, ముగ్గురు జోర్ధాన్ దేశస్థులు, ఏడుగురు సౌదీకి చెందిన వారు అని త్రోసెల్ వెల్లడించారు. కాగా, సౌదీ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో వివిధ నేరాల్లో దోషులుగా తేలిన 81 మందికి మరణశిక్షను అమలు చేసింది. అదికూడా ఒక్కరోజే వీరందరికీ శిక్ష వేయడం గమనార్హం. వీరిలో ఉగ్రవాద సంస్థలకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 144 మందిని సౌదీ ప్రభుత్వం
బహిరంగంగా శిక్షించింది.