ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని లాహోర్ జైలులో భారత పౌరుడు సరబ్జిత్సింగ్ను హత్య చేసిన పాక్ అండర్ వరల్డ్ డాన్ అమిర్ సర్ఫరాజ్ను ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అమిర్పై కాల్పులు జరిపినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తీవ్రంగా గాయపడిన అతడిని దవాఖానకు తరలించేలోపే మరణించినట్టు పేర్కొన్నాయి. సరబ్జిత్ సింగ్ మన దేశంలోని పంజాబ్ రాష్ర్టానికి చెందినవారు.
ఆయన కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, వ్యవసాయం చేసేటపుడు సరబ్జిత్ సరిహద్దులను దాటి పాకిస్థాన్లోకి వెళ్లిపోయారు. ఆయన గూఢచర్యానికి పాల్పడినట్లు, 1990లో పాక్లోని పంజాబ్ ప్రావిన్స్లో బాంబు పేలుళ్లలో 14 మంది పాకిస్థానీల మరణానికి కారకుడైనట్లు పాక్ ఆరోపించింది. ఈ కేసులో ఆయనకు పాక్ కోర్టు మరణ శిక్ష విధించింది. సరబ్జిత్ లాహోర్లోని కోట్ లఖ్పత్ జైలులో 23 సంవత్సరాలపాటు మగ్గిపోయారు.
భారత పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురుకు భారత్లో మరణ శిక్ష అమలు చేసిన తర్వాత, పాక్ జైలులోని సరబ్జిత్పై అమిర్తోపాటు కొందరు ఖైదీలు దాడిచేశారు. సరబ్జిత్ తలకు తీవ్ర గాయాలవడంతో లాహోర్లోని దవాఖానకు తరలించారు. కానీ ఆయన 2013 మే నెలలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఆయన జీవిత కథతో ఓ బాలీవుడ్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.