మాస్కో: రష్యా అధ్యక్షుడు(Russian President) వ్లాదిమిర్ పుతిన్.. జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజిలా మెర్కల్కు క్షమాపణలు చెప్పారు. 17 ఏళ్ల క్రితం జరిగిన ఆ ఘటనపై ఆయన పశ్చాతాపం వ్యక్తం చేశారు. 2007లో సోచి నగరంలో జరిగిన ఓ మీటింగ్కు మెర్కల్ హాజరయ్యారు. అయితే ఆ మీటింగ్కు పుతిన్ పెంపుడు శునకం లాబ్రడార్ కోని కూడా వచ్చింది. మెర్కల్ కూర్చున్న కుర్చీ చుట్టూ ఆ శునకం పహారా కాసింది. ఆ సమయంలో మెర్కల్ కాస్త ఆందోళనకు గురయ్యారు. కుక్కలకు భయపడే మెర్కల్ ఆ ఘటన పట్ల సీరియస్ అయ్యారు. ఇటీవల ఫ్రీడమ్ అనే టైటిల్తో మెర్కల్ ఓ పుస్తకాన్ని రాశారు. దాంట్లో ఆ ఘటన గురించి ఆమె ప్రస్తావించారు. పుతిన్ పెంపుడు కుక్క వల్ల తాను చాలా ఇబ్బందిపడినట్లు పేర్కొన్నారు. తనను బెదిరించేందుకు పుతిన్ ఆ పని చేశారని మెర్కల్ తన బుక్లో తెలిపారు. ఆ ఘటన పట్ల గురువారం పుతిన్ మరోసారి క్షమాపణలు చెప్పారు.
నిజానికి మెర్కల్కు కుక్కలు అంటే భయం. 1995లో ఆమెను ఓ శునకం కరిచింది. అప్పటి నుంచి ఆమె కుక్కలకు భయపడుతోంది. కానీ పుతిన్ను కలిసిన సమయంలో.. ఆ మీటింగ్కు పెంపుడు కుక్క రావడంతో ఆమెకు భయమేసింది. తాను భయపడుతుంటే ఆ ఘటన చూసి పుతిన్ ఎంజాయ్ చేసినట్లు ఆమె ఆరోపించారు. ఆ ఘటన పట్ల గతంలోనే క్షమాపణలు చెప్పినట్లు కజకిస్తాన్లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో పుతిన్ తెలిపారు. మెర్కల్కు కుక్కలంటే భయమన్న విషయం తెలియదని, లేదంటే ఆ రోజు అలా జరిగేది కాదు అని పేర్కొన్నారు.