కీవ్: రష్యా దాడుల్లో ఇప్పటి వరకు 153 మంది పిల్లలు మరణించినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. అలాగే 245 మంది చిన్నారులు గాయపడ్డారని తెలిపింది. ఫిబ్రవరి 24 నుంచి ఆరంభమైన రష్యా దురాక్రమణలో 400 మంది పిల్లలు ప్రభావితమయ్యారని ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి పేర్కొన్నారు. రష్యా దాడుల్లో రాజధాని కీవ్ దద్ధరిల్లిందని, ఈ ప్రాంతంలో అత్యధికంగా 73 మంది పిల్లలు మరణించారని ప్రాసిక్యూటర్ జనరల్ తెలిపారు. డొనెట్స్కీలో 65 మంది, ఖార్కివ్లో 46 మంది పిల్లలు చనిపోయారని చెప్పారు. రష్యా దళాలు స్వాధీనం చేసుకున్న మరియుపోల్, చెర్నిహివ్, లుహాన్స్క్ నగరాల్లో ఎంత మంది పిల్లలు మరణించారో తెలియలేదన్నారు. దీంతో పిల్లల మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందన్నారు.
విద్యా సంస్థలను కూడా రష్యా దళాలు లక్ష్యంగా చేసుకున్నాయని ఉక్రెయిన్ ఆరోపించింది. బాంబు దాడులు, కాల్పుల్లో ఇప్పటి వరకు 859 విద్యా సంస్థలు ధ్వంసమయ్యాయని తెలిపింది. ఇందులో 83 భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయని పేర్కొంది. డొనెట్స్కీ, ఖార్కివ్, మైకోలైవ్, సుమీ, కీవ్, ఖెర్సన్, జైటోమిర్, చెర్నిహివ్ ప్రాంతాల్లోని విద్యాసంస్థలు బాగా ధ్వంసమయ్యాయని వెల్లడించింది.
మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దాడి శుక్రవారానికి 37వ రోజుకు చేరింది. అయితే ఉక్రెయిన్తో కొనసాగుతున్న శాంతి చర్చల్లో కొంత పురోగతిని సాధించినట్లు భారత్ పర్యటనలో ఉన్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. ఉక్రెయిన్ ప్రతిపాదనలను రష్యా పరిశీలిస్తున్నదని చెప్పారు.