మాస్కో: ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా, అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో జరిగే విచారణలో పాల్గొనేందుకు నిరాకరించింది. దీని కోసం తమ ప్రతినిధులెవ్వరినీ పంపకూడదని రష్యా నిర్ణయించింది. గత నెల 24న రష్యా దాడి నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ఐసీజే)ను ఉక్రెయిన్ ఆశ్రయించింది. ఉక్రెయిన్ రాష్ట్రాల వివాదంపై హేగ్లోని అత్యున్నత ఐక్యరాజ్యసమితి కోర్టులో రష్యాపై దావా వేసింది. అలాగే రష్యా యుద్ధ నేరాలపై హేగ్లోని మరో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును కూడా ఉక్రెయిన్ ఆశ్రయించింది. ఉక్రెయిన్లో యుద్ధాన్ని వెంటనే నిలిపివేసేలా రష్యాను ఆదేశించాలని కోరింది.
కాగా, ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో జరిగిన యుద్ధ నేరాలపై దర్యాప్తు ప్రారంభించాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) నిర్ణయించింది. ప్రాథమిక పరిశీలన మేరకు రష్యాపై ఉక్రెయిన్ ఆరోపించిన యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు జరిగాయని తాను నమ్ముతున్నానని ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీమ్ ఏఏ ఖాన్ తెలిపారు. అయితే అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో జరిగే విచారణలో పాల్గొనేందుకు రష్యా నిరాకరించింది. తమ ప్రతినిధులెవ్వరినీ పంపకూడదని నిర్ణయించింది.