లండన్ : సిక్కు వేర్పాటువాది నిజ్జర్ హత్యోదంతంలో భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాల్లో ఏర్పడిన ప్రతిష్టంభనపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో చర్చించారు. ఈ సందర్భంగా భారత్లోని కెనడా దౌత్యవేత్తల పరిస్థితిని ట్రూడో వివరించారు. ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన తగ్గుతుందని సునాక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ సమస్యలను ఎదుర్కొనే విషయమై ఇరు దేశాల ప్రధానులు తరచూ చర్చించుకోవాలని నిర్ణయించినట్టు కెనడా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. నిజ్జర్ హత్యకు భారత ఏజెంట్లే కారణమని గత నెలలో ట్రూడో ఆరోపించిన తర్వాత భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
సరైన ఆధారాల్లేకుండా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో భారత్కు వ్యతిరేకంగా ఆరోపణలు చేయటం దురదృష్టకరమని యుఎస్ఐఎస్పీఎఫ్ (అమెరికా-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరం) చీఫ్ ముఖేశ్ అఘి అన్నారు. కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు ఇరు దేశాల సంబంధాల్ని తీవ్రంగా ప్రభావితం చేశాయన్నారు. ‘పరిణితి చెందిన వ్యక్తులు ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సి ఉంటుంది’ అని అభిప్రాయపడ్దారు.