లండన్: ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్లో మళ్లీ రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే భారతీయ సంతతి ఎంపీ రిషి సునాక్(Rishi Sunak) ఈసారి కూడా ప్రధాని రేసులో ఉన్నారు. కన్జర్వేటివ్ ఎంపీ రిషి సునాక్ .. ప్రధాని అయ్యేందుకు కావాల్సిన అర్హతలను అందుకున్నారు. ఇప్పటికే ఆయనకు వంద మంది ఎంపీలు మద్దతు ఇచ్చారు. పార్టీ నాయకత్వాన్ని చేపట్టాలన్నా, లేక ప్రధాని కావాలన్నా.. కనీసం వంద మంది ఎంపీలు మద్దతు తెలుపాలి. అయితే రిషి సునాక్ ఆ కీలక మైలురాయిని దాటేశారు. దీంతో ఆయన బ్రిటన్ ప్రధాని రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.
కానీ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి ఆ పోస్టుపై కన్నేసినట్లు తెలుస్తోంది. కరీబియన్ దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న బోరిస్.. హుటాహుటిన మళ్లీ బ్రిటన్కు బయలుదేరారు. బ్రిటన్ ప్రధాని పదవికి పోటీపడుతున్నట్లు ఇప్పటికే క్యాబినెట్ సభ్యురాలు పెన్నీ మోర్డాంట్ ప్రకటించారు. ఎంపీ రిషి సునాక్కు మద్దతు ఇస్తున్న వందవ ఎంపీని తానే అంటూ సీనియర్ నేత తోబియాస్ ఎల్వుడ్ ట్వీట్ చేశారు.
బోరిస్ జాన్సన్కు ఇప్పటి వరకు 44 మంది మద్దతు ఇచ్చారు. పెన్నీ మోర్డాంట్కు 21 మంది మద్దతు ఉంది. అయితే ఇప్పటి వరకు సునాక్ లేదా జాన్సన్ అధికారికంగా ప్రచారం మొదలుపెట్టలేదు. కానీ వాళ్లకు మాత్రం టోరీ పార్టీ ఎంపీలు మద్దతు ముందే ప్రకటించారు.
సునాక్కు మద్దతు ప్రకటించినవాళ్లలో ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్, సెక్యూర్టీ మినిస్టర్ టామ్ టుగెన్డాట్, మాజీ ఆరోగ్య కార్యదర్శి ఆట్ హన్కాక్ ఉన్నారు. పార్టీని ముందు ఉండి నడపడంలో సునాక్ సరైన వ్యక్తి అని జావెద్ తెలిపారు.