లండన్, సెప్టెంబర్ 1: చిరిగినప్పటికీ తనంతట తానుగా తిరిగి యథాస్థానానికి చేరుకునే (రిపేర్ చేసుకునే) లెదర్ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇంగ్లండ్లోని న్యూక్యాస్టిల్ టైన్ సంస్థకు చెందిన పరిశోధకులు దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. పుట్టగొడుగుల ద్వారా సేకరించిన మిసీలియం అనే పదార్థం నుంచి తయారైన లెదర్ పదార్థానికి చిరిగినప్పటికీ తిరిగి యథా స్థానానికి చేరుకునే గుణం ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. పరిశోధనల్లో భాగంగా పుట్టగొడుగుల నుంచి సేకరించిన మిసీలియం పదార్థానికి ప్రొటీన్లు, కార్బొహైడ్రేడ్లు తదితర పోషకాల ద్రవాన్ని జత చేశారు.
కొంతసేపటి తర్వాత ఆ ద్రవంలో ఓ పొర ఏర్పడగా.. దానికి గ్లిసరాల్ను కలిపారు. ఆ ద్రవాన్ని 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఆరబెట్టి మృధువైన లెదర్ పదార్థాన్ని అభివృద్ధి చేశారు. మిసీలియంలో ఉండే పంగస్ కారణంగా ఈ పదార్థానికి చిరిగినప్పటికీ యథా స్థానానికి చేరుకునే గుణం వచ్చినట్టు పరిశోధకులు తెలిపారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. ఇతర సంస్థల పరిశోధకులకు తాము అభివృద్ధి చేసిన పదార్థానానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకుంటామని వారు తెలిపారు.