Rishi Sunak | బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ నియమితులయ్యారు. భారతావని దీపావళి పండుగ సంబురాలు జరుపుకుంటుండగా బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ స్థానానికి పోటీ పడిన పెన్నీ మోర్డాంట్ వైదొలగడంతో బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తొలి భారత సంతతి నేతగా నిలిచారు. బ్రిటన్ ప్రధానిగా రిషి ఎన్నికవడం పట్ల భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రిషికి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
ఇందులోభాగంగా సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం రిషి సునాక్కు అభినందనలు తెలిపారు. ‘‘200 ఏండ్ల పాటు మనల్ని పాలించిన బ్రిటిషర్లను పాలించే అవకాశం ఎట్టకేలకు మనకు ఇప్పుడు దొరికింది. ఆ దిశగా సత్తా చాటిన రిషి సునాక్ కు అభినందనలు’’ అంటూ వర్మ ట్వీట్ చేశారు.
గత 210 ఏండ్లలో బ్రిటన్ పాలనా పగ్గాలు చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా రిషి సునాక్ రికార్డు నెలకొల్పారు. ప్రస్తుతం దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నదని, కఠిన నిర్ణయాలు తప్పవని తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటన్కు తిరిగి పూర్వవైభవం తేవటమే తన మొదటి లక్ష్యమన్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన కార్యాలయం 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
After 200 years of them ruling us , finally we are ruling them💪 #Rushisunak
— Ram Gopal Varma (@RGVzoomin) October 25, 2022