పాకిస్తాన్ పార్లమెంట్ స్పీకర్గా మాజీ ప్రధాని రాజా పర్వేజ్ అష్రఫ్ నియమితులు కానున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి పార్లమెంట్ ఇవ్వాళ సమావేశం కానుంది. స్పీకర్ పదవికి ఇతరులెవ్వరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఈయనే ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారని పాక్ మీడియా పేర్కొంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన పర్వేజ్… గతంలో పాక్ ప్రధానిగా సేవలందించారు. ఇక ఈ ఘట్టం ముగిసిన తర్వాత మాజీ ప్రధాని ఇమ్రాన్ హయాంలో డిప్యూటీ స్పీకర్గా ఉండి, వార్తల్లోకెక్కిన సూరీపై కూడా పెట్టిన అవిశ్వాస తీర్మానంపై పాక్ పార్లమెంట్ ఇవ్వాళ చర్చించనుంది.
అవిశ్వాస తీర్మానంలో ఓడి పదవి కోల్పోయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) ప్రధాని సర్దార్ అబ్దుల్ ఖయ్యుం నైజీ గురువారం రాజీనామా చేశారు. పీటీఐ పార్టీలో నెలకొన్న తిరుగుబాటు నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకున్నది. ఇమ్రాన్ వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్న అబ్దుల్ ఖయ్యుంను దించేందుకు సొంత పార్టీకే చెందిన 25 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ప్రధాని కుర్చీలో పీటీఐ ప్రాంతీయ అధ్యక్షుడు సర్దార్ తన్వీర్ను కూర్చొబెట్టాలనేది తిరుగుబాటు వర్గం ప్లాన్.