మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ అనుచరురాలు, ఉక్రెయిన్ యుద్ధం కోసం నిధులు సమకూర్చడంలో కీలకంగా వ్యవహరించిన మెరీనా యాంకినా అనుమానాస్పదంగా మరణించింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక విభాగానికి చీఫ్గా ఉన్న ఆమె బుధవారం ఉదయం సెయింట్ పీటర్స్బర్గ్లోని 16 అంతస్తుల భవనం నుంచి కింద పడి చనిపోయింది. ఒక రెసిడెన్సియల్ కాంప్లెక్స్ ఆవరణలోని కాలిబాట వద్ద మెరీనా పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె మరణంపై రష్యా అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆ కాంప్లెక్స్లోని అపార్ట్మెంట్ ఆమె భర్తకు చెందినదిగా స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. అందులో ఆమెకు సంబంధించిన వస్తువులు కూడా ఉన్నట్లు వెల్లడించాయి.
కాగా, ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి నిధులు సమకూర్చడంలో 58 ఏళ్ల మెరినా యాంకినా కీలకంగా వ్యవహరించారు. రష్యాకు చెందిన ఐదు భౌగోళిక బెటాలియన్లలో ఒకటైన వెస్ట్రన్ మిలిటరీ డిస్ట్రిక్ట్కు ఫైనాన్స్ డైరెక్టర్గా ఆమె ఉన్నారు. దీనికి ముందు ఫెడరల్ టాక్స్ సర్వీస్లో మెరినా పనిచేశారు. సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాపర్టీ రిలేషన్స్ కమిటీ డిప్యూటీ ఛైర్మన్గా కూడా ఆమె వ్యవహరించారు.
మరోవైపు గత ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా యద్ధం ప్రారంభించింది. మరో వారం రోజుల్లో ఈ యుద్ధం మొదలై ఏడాది పూర్తి కావస్తున్నది. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో కీలకంగా వ్యవహరించిన కొందరు రష్యా మిలిటరీ అధికారులు అనుమానాస్పదంగా మరణించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలగించిన ఆర్మీ మేజర్ జనరల్ వ్లాదిమిర్ మకరోవ్ ఇటీవల అనుమానాస్పదంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు.
గత ఏడాది డిసెంబర్ 26న రష్యన్ డూమా డిప్యూటీ పావెల్ ఆంటోనోవ్, భారత్లోని ఒక హోటల్ కిటికీ నుంచి కింద పడి మరణించారు. అలాగే రష్యా గ్రౌండ్ ఫోర్సెస్ మాజీ చీఫ్ అలెక్సీ మస్లోవ్ డిసెంబర్ 25న ఆసుపత్రిలో చనిపోయారు. పదేళ్ల పాటు రష్యా ‘అడ్మిరల్టీ షిప్యార్డ్స్’ అధిపతిగా పనిచేసిన అలెగ్జాండర్ బుజాకోవ్ కూడా డిసెంబర్ 24న మరణించారు.