మాస్కో: ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యాకు చుక్కలు కనిపిస్తున్నాయి. అడగడుగునా ఎదురుదెబ్బలు తగులుతుండటంతో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రిజర్వ్ సైనిక దళాల్ని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్పై ఫిబ్రవరిలో అటాక్ మొదలుపెట్టిన రష్యాను ఉక్రెయిన్ అడగడుగునా తిప్పికొడుతున్నది. దీంతో రష్యా రిజర్వ్ సైనికుల్ని కూడా రంగంలోకి దింపనున్నది. దీనికి సంబంధించిన ఆదేశాలను కూడా జారీ చేసినట్లు జాతిని ఉద్దేశించిన చేసిన ప్రసంగంలో పుతిన్ వెల్లడించారు. దీంతో సుమారు 3 లక్షల మంది రిజర్వ్ లేదా మాజీ సైనికులు దళంలో చేరే అవకాశాలు ఉన్నాయి.
పశ్చిమ దేశాలు తమను బ్లాక్మెయిల్ చేస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. తమ ప్రాంతీయ సమగ్రతకు ఎటువంటి ప్రమాదం జరిగినా.. రష్యాను, తమ ప్రజలను కాపాడుకునేందుకు, తమ వద్ద ఉన్న అన్ని రకాల వ్యవస్థలను వాడుకుంటామని పుతిన్ హెచ్చరించారు. అణ్వాయుధాలను చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయాలనుకునేవాళ్లు ఒకటి గుర్తుంచుకోవాలని, ఆ పరిస్థితులు తిరగబడే అవకాశం ఉన్నట్లు ఆయన అన్నారు.
ఉక్రెయిన్తో జరిగిన యుద్ధంలో 5937 మంది సైనికులు చనిపోయినట్లు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోగు తెలిపారు. ఇక ఉక్రెయిన్లో చనిపోయిన ఆ దేశ సైనికుల సంఖ్య 10 రేట్లు ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. ఉక్రెయిన్కు చెందిన సుమారు 61207 మంది సైనికులు యుద్ధంలో మృతిచెంది ఉంటారని మంత్రి సెర్గీ అంచనా వేశారు.