హైదరాబాద్: హిమాలయాల్లో ప్రవహించే నదుల్లో బ్రహ్మపుత్ర ఒకటి. అది పుట్టింది టిబెట్లో. దాన్ని అక్కడ యార్లుంగ్ ఝాంగ్బో అంటారు. అయితే టిబెట్లోని మిడాగ్ జిల్లాలో భారీ జల విద్యుత్తు ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఆ ప్రాజెక్టు కోసం డ్రాగన్ దేశం చైనా ప్లాన్ వేసింది. తన పంచవర్ష ప్రణాళికలో కూడా ఆ సూపర్ డ్యామ్ కోసం బడ్జెట్ కేటాయించింది. భారత్లో బ్రహ్మపుత్ర ప్రవేశించడానికి ముందే ఈ భారీ డ్యామ్ను టిబెట్లో చైనా నిర్మిస్తోంది. సముద్ర మట్టానికి 4900 ఫీట్ల ఎత్తులో ప్రవహించే బ్రహ్మపుత్ర ఎగువన చైనా నిర్మిస్తున్న డ్యామ్ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది.
ప్రస్తుతం చైనాలో ఉన్న అతిపెద్ద డ్యామ్ త్రీ గార్జెస్. ఆ డ్యామ్ కన్నా పెద్ద సైజులో ప్రస్తుతం బ్రహ్మపుత్రపై కట్టాలని ఆ దేశం భావిస్తున్నది. సెంట్రల్ చైనాలోని యాంగ్జీ నదిపై ఉన్న త్రీ గార్జెస్ డ్యామ్ కన్నా భారీ స్థాయిలో కొత్త డ్యామ్ను నిర్మించనున్నారు. ప్రతిపాదిత కొత్త డ్యామ్ ప్రతి ఏడాది సుమారు 300 బిలియన్ల కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. 60 గిగా వాట్ల సామర్థ్యంతో ఆ సూపర్ డ్యామ్ను నిర్మించనున్నారు. త్రీ గార్జెస్ డ్యామ్ కన్నా.. కొత్తగా నిర్మించబోయే డ్యామ్ మూడు రెట్లు అధిక విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం పవర్ చైనాతో పాటు టిబెట్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. త్రీ గార్జెస్ డ్యామ్ 2020లో 103 బిలియన్ల కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది.
పర్యావరణవేత్తలు మాత్రం ఈ బ్రిడ్జ్ను వ్యతిరేకిస్తున్నారు. త్రీ గార్జెస్ నిర్మాణ సమయంలో సుమారు 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. టిబెట్లో డ్యామ్ నిర్మాణం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.