శ్రీనగర్: కశ్మీర్ వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ బుధవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే గిలానీ మృతి పట్ల పాకిస్థాన్ ఇవాళ అధికారిక సంతాప దినంగా ప్రకటించింది. గిలానీ మృతి పట్ల నివాళి అర్పించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఈ విషయాన్ని తన ట్విట్టర్లో తెలిపారు. గిలానీ తన జీవితాన్ని ప్రజల కోసం ధారపోశారన్నారు. భారత ప్రభుత్వం ఆయన్ను వేధించినట్లు ఇమ్రాన్ ఆరోపించారు. గిలానీ మృతికి నివాళిగా ఇవాళ పాకిస్థాన్ జెండాను అవనతం చేయనున్నట్లు ఇమ్రాన్ వెల్లడించారు.
92 ఏళ్ల గిలానీ శ్రీనగర్లోని తన నివాసంలో మృతిచెందారు. ఇస్లామిక్ నేత అయిన గిలానీ.. జమ్మూకశ్మీర్లో వేర్పాటువాద ఉద్యమాన్ని సాగించారు. చాన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాజకీయాలకు స్వస్తి పలికారు. హురియత్కు కూడా ఆయన గుడ్బై చెప్పారు. 2018 మార్చిలో ఆయన స్వల్ప గుండెపోటు వచ్చింది. అప్పుడు ఆయన హాస్పిటల్లో చికిత్స పొందారు.
వేర్పాటు వాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ పదవి నుంచి గిలానీ జూన్లో వైదొలిగారు. ఆయన మృతి పట్ల జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ సంతాపం ప్రకటించారు.