శ్రీలంకకు అతి త్వరలో కొత్త ప్రధాని రానున్నారు. ప్రస్తుతం ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహింద్ర రాజపక్సేను ఆ పదవి నుంచి తప్పించడానికి శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే అంగీకరించారు. ఈ పరిణామంతో లంక రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు కొన్ని రోజులుగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గొటబయ రాజపక్సే పై నిర్ణయం తీసుకున్నారు.
దేశంలో ఏర్పడ్డ సంక్షోభానికి, ముగింపు పలకాలన్న కారణంగా మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు గొటబయ రాజపక్సే తన అంగీకారం తెలిపారు. అయితే.. కొత్త ప్రధాని ఎవరన్న దానిపై ఓ నేషనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నారు. ఆ కౌన్సిలే తదుపరి ప్రధానిని ఎంపిక చేయనుంది. ఈ విషయాన్ని శ్రీలంక ఎంపీ మైత్రిపాల సిరిసేన వెల్లడించారు.
శ్రీలంక తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాలు ఆ దేశాన్ని చుట్టుముట్టాయి. విపరీతమైన అప్పులు కూడా అయ్యాయి. దీంతో అధ్యక్షుడు గొటబాయ, ప్రధాని మహీంద రాజపక్సేతో సహా ఆయన కుటుంబీకులు వెంటనే గద్దె దిగాలంటూ ప్రజలు తీవ్ర ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు దేశ అధ్యక్షుడు గొటబయ ఓకే చెప్పారు.